హైదరాబాద్ : మహబూబాబాద్ టీఆర్ఎస్ ఎంపీ మాలోతు కవితకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వైద్యుల సూచన మేరకు హైదరాబాద్లో హోం ఐసోలేషన్లో ఉన్నట్లు కవిత వెల్లడించారు. ఇటీవల తనను కలిసిన వారంతా కొవిడ్ టెస్టులు చేయించుకోవాలని, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని ఎంపీ సూచించారు.
తెలంగాణ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గత కొద్ది రోజులుగా రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 3,840 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ శుక్రవారం హెల్త్ బులిటెన్లో తెలిపింది. వైరస్ బారినపడి మరో తొమ్మిది మరణించారని పేర్కొంది. కొత్తగా 1,198 మంది బాధితులు వైరస్ నుంచి కొలుకొని ఇండ్లకు వెళ్లారు. భారీగా పెరుగుతున్న కేసులతో రాష్ట్రంలో క్రియాశీల కేసులు 30వేలు దాటాయి. ప్రస్తుతం 30,494 యాక్టివ్ కేసులున్నాయని, 20,215 మంది హోం ఐసోలేషన్లో ఉన్నారని తెలిపింది.
కొత్తగా నమోదైన కేసులో అత్యధికంగా 505 జీహెచ్ఎంసీలో, మేడ్చల్లో 407, రంగారెడ్డిలో 302, నిజామాబాద్లో 303, సంగారెడ్డిలో 175 అత్యధికంగా కొవిడ్ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒకే రోజు రాష్ట్రంలో 1,21,880 కరోనా పరీక్షలు చేసినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,41,885కు చేరగా, ఇప్పటి వరకు 3,09,594 మంది కోలుకున్నారు.