వందేండ్ల తర్వాత మహానగరాన్ని ముంచెత్తిన వరద బాధలకు శాశ్వతంగా ముగింపు పలికేందుకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. వ్యూహాత్మక నాలా అభివృద్ధి కార్యక్రమం (ఎస్ఎన్డీపీ) పేరిట ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి నాలాలను సమూలంగా ప్రక్షాళన చేయాలని నిర్ణయించింది.
ఆక్రమణకు గురైన, కుంచించుకు పోయిన నాలాలను విస్తరించడంతోపాటు వరదనీటి కాల్వలను బలోపేతం చేయనున్నారు. పుర పాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఎస్ఎన్డీపీ విభాగం అధికారులు సమగ్రంగా అధ్యయనం చేసి నివేదిక సమర్పించారు. ప్రధానంగా గొలుసుకట్టు చెరువుల్ని అనుసంధానించి, మురుగు చేరకుండా చూడడంతోపాటు వరద సాఫీగా మూసీలోకి వెళ్లేలా తక్షణ చర్యలకు ప్రభుత్వం రూ.858 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 15 ప్యాకేజీలు విభజించి పనులు చేపట్టనుండగా, డీపీఆర్లను సిద్ధం చేసి మే తొలివారం లోపు టెండర్లు ఆహ్వానించి 9 నెలల్లో పనులు పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ప్రధానంగా హుస్సేన్సాగర్ నూతన గేట్ల ఏర్పాటుకు రూ.41కోట్లు, ఆరు లేన్ల మేజర్ వంతెన నిర్మాణానికి రూ.25 కోట్లు వెచ్చించనున్నారు.
గ్రేటర్ హైదరాబాద్లో వరద సమస్య పునరావృతం కాకుండా పటిష్ట చర్యలకు ప్రభుత్వం నడుం బిగించింది. వ్యూహాత్మక నాలా అభివృద్ధి పథకం(ఎస్ఎన్డీపీ) పేరిట ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసిన సర్కారు నాలాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా భారీ ప్రణాళికలకు రూపకల్పన చేసింది. గతేడాది అక్టోబర్లో హైదరాబాద్ చరిత్రలోనే రెండో అతిపెద్ద వర్షం సృష్టించిన బీభత్సానికి అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. ఏకమైన చెరువులు, కుంటలు కాలనీలను ముంచెత్తాయి. దాదాపు 40 వేల మంది రోజుల తరబడి వరదలో చిక్కి బిక్కుబిక్కుమంటూ రోజులు వెళ్లదీశారు. ఇలాంటి ఘటనలు తిరిగి పునరావృతం కాకుండా ఎస్ఎన్డీపీ విభాగం వరద పరిస్థితులను అధ్యయనం చేసింది. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఎస్ఎన్డీపీ విభాగం అధికారులు ప్రత్యేకంగా నివేదిక సిద్ధం చేశారు.
గొలుసుకట్టు చెరువుల్ని అనుసంధానించి.. చెరువుల్లోకి మురుగు చేరకుండా ఉండటంతో పాటు వరద నీరు సాఫీగా మూసీలోకి వెళ్లేలా ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వానికి అందజేశారు. దీంతో తక్షణ చర్యల నిమిత్తం ప్రభుత్వం రెండు రోజుల క్రితం రూ.858 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. చెరువులు, కుంటలు, తూముల అభివృద్ధి తదితర పనులతో పాటు నాలాల విస్తరణ, ఆధునీకరణ, వర్షం నీరు వెళ్లేందుకు వీలు లేని చోట్ల నిర్మాణాలు, కుంచించుకుపోయిన చోట నాలాల విస్తరణ, రహదారి కంటే ఎత్తున నాలాలను సమం చేయడం, వరద నీటి కాల్వల బలోపేతం కోసం ఈ నిధులను వినియోగించనున్నారు. మొత్తంగా 15 ప్యాకేజీలుగా విభజించి ఈ పనులను చేపట్టనున్నారు. త్వరలో ప్యాకేజీల వారీగా డిటెల్డ్ ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్)లను సిద్ధం చేసి వచ్చే నెల మొదటి వారంలోగా టెండర్లు పిలిచి పనులు ప్రారంభించి.. తొమ్మిది నెలల్లో పూర్తి చేయాలనే భావనలో అధికారులున్నారు. ప్రధానంగా వరద నివారణ చర్యల్లో భాగంగా హుస్సేన్సాగర్ గేట్ల ఏర్పాటుకు రూ.41 కోట్ల, ఆరులేన్ల మేజర్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.25 కోట్ల కేటాయించనున్నారు.
రూ.39 కోట్లతో పద్మాకాలనీ నుంచి శివానంద్ నగర్ (తిలక్నగర్ బ్రిడ్జి) మీదుగా ఫీవర్ దవాఖాన వరకు నాలా విస్తరణ పనులు చేపట్టనున్నారు. రెండు చోట్ల బ్రిడ్జిల నిర్మాణం చేపడతారు.
నల్లపోచమ్మ టెంపుల్ వీఎస్టీ నుంచి విద్యానగర్ రోడ్ వరకు, వెజిటేబుల్ మార్కెట్ హెరిటేజ్ సముదాయం నుంచి నాగమయ్యకుంట నాలాపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నారు. ఇందుకోసం రూ.12 కోట్లు ఖర్చు చేయనున్నారు. వీటితో పాటు రాణిగంజ్ బస్ డిపో డబుల్ బెడ్ ర్రూం ఇండ్ల దగ్గరలో, బుద్ధభవన్ గ్రేవీయార్డ్ క్రాసింగ్ వద్ద, ట్యాంక్బండ్ రోడ్ నుంచి కవాడిగూడ మారియట్ హోటల్ దగ్గర బ్రిడ్జిల నిర్మాణ పనులు చేపడతారు. వీటికిగానూ రూ.16 కోట్లు ఖర్చు చేయనున్నారు. దీంతో నాగమయ్యకుంట, సాయిచరణ్కుంట, పద్మాకాలనీ, ఆదర్శ్కాలనీ, ఎల్ నారాయణ నగర్ ప్రాంతాల వాసులకు ఉపశమనం లభించనుంది.
డబుల్ బెడ్ ర్రూం ఇండ్ల కాంప్లెక్స్ నుంచి మారియట్ హోటల్ వద్ద సర్ఫ్లస్ నాలా విస్తరణ పనులను రూ.20 కోట్లతో చేపట్టనున్నారు. ఎస్పీ రోడ్లోని కరాచీ బేకరీ నుంచి పికెట్ నాలాను రీ మోడలింగ్ చేస్తారు. ఇందుకోసం రూ.10 కోట్లు ఖర్చు చేయనున్నారు. బేగంపేట అల్లంతోట బావి ప్రాంతాలకు ముంపు తప్పనున్నది.
ట్యాంక్బండ్ వద్ద రూ.25 కోట్లతో ఆరు లేన్లతో బ్రిడ్జి నిర్మాణ పనులు చేపడతారు. రూ.41 కోట్లతో హుస్సేన్సాగర్కు గేట్లు ఏర్పాటు చేస్తుండటంతో పటేల్నగర్, నల్లకుంట, అంబర్పేట, ప్రేమ్నగర్, అరుంధతి నగర్ తదితర ప్రాంతాల వాసులకు వరద కష్టాలు శాశ్వతంగా తొలగిపోనున్నాయి.
ఫాక్స్ సాగర్ లేక్ స్లుయిస్ వాల్, సర్ఫ్లస్ ఛానెల్ రీస్టోరేషన్, కోల్ కల్వ నుంచి కెమికల్ నాలా వయా వెన్నెలగడ్డ చెరువు వరకు పనులకు రూ. 95 కోట్లు ఖర్చు చేయనున్నారు. మోదుగుల కుంట నుంచి కొత్త చెరువు బలోపేతం కోసం రూ.17.80 కోట్లు వెచ్చించనున్నారు. ఈ పనులతో ఎర్రకుంట కమ్యూనిటీహాల్, సీడీఎస్ బిల్డింగ్, కమలా మోమోరియల్ స్కూల్, సుభాష్నగర్, దేవేందర్ నగర్, పేట్బషీర్బాగ్, మయూరిమార్గ్, జీడిమెట్ల తదితర ప్రాంతాలకు ముంపు సమస్య ఉండదు.
మన్సూరాబాద్ చిన్న చెరువు నుంచి బండ్లగూడ చెరువు వరకు రూ.6.69 కోట్లు, బండ్లగూడ చెరువు నుంచి నాగోల్ చెరువు వరకు రూ.7.26 కోట్లు, బండ్లగూడ చెరువు నుంచి మూసీ నది వరకు రూ.30.08 కోట్లు, బండ్లగూడ చెరువు నుంచి ఇంజాపూర్ నాలా వరకు రూ.9.65 కోట్లు, రామంతాపూర్ పెద్ద చెరువు నుంచి రామంతాపూర్ చిన్న చెరువు, రామంతాపూర్ చిన్న చెరువు నుంచి ఇరిగేషన్ ఛానెల్ వరకు రూ.10.34 కోట్లు, చందన గార్డెన్ నుంచి సరూర్నగర్ లేక్, వంగశంకరమ్మ గార్డెన్ నుంచి సరూర్నగర్ లేక్ వరకు రూ.28.10 కోట్లతో చెరువుల బలోపేతం, నాలాల విస్తరణ పనులు చేపట్టనున్నారు.
ఎల్బీనగర్ జోన్ పరిధిలో సరూర్నగర్ చెరువు నుంచి చైతన్యపురి వయా జేసీ కార్యాలయం, సరూర్నగర్ లేక్ నుంచి చైతన్యపురి వయా కోదండరాం నగర్ వరకు రూ. 21.47 కోట్లతో పనులు చేపట్టనున్నారు. దీంతో ఎల్బీనగర్ జోన్ పరిధిలోని మన్సూరాబాద్, నాగోల్, బీఎన్రెడ్డి నగర్, హస్తినాపురం, చంపాపేట డివిజన్ పరిధిలోని వందలాది కాలనీల వరద కష్టాలకు చెక్ పడుతుంది. ప్రధానంగా అయ్యప్పకాలనీ, మల్లికార్జుననగర్, గుంటి జంగయ్య నగర్, రెడ్డి కాలనీ, సాగర్ ఎన్క్లేవ్, దాతునగర్, వెంకటేశ్వర కాలనీ, బైరామల్గూడ ఎస్సీ బస్తీ, గ్రీన్పార్క్ కాలనీ, సౌభాగ్యనగర్, మన్సూరాబాద్ వీకర్సెక్షన్ కాలనీ, సాహెచ్నగర్ కమ్యూనిటీ హాల్, లింగోజిగూడ కాకతీయ కాలనీ, సరూర్నగర్ ప్రాంతాల వాసులకు ఉపశమనం లభించనుంది.
షా హతీతి నుంచి లంగర్హౌస్ (వయా మోతిదర్వాజా), నదీం కాలనీ నుంచి షా హతీమ్, మజీద్ ఆ అంబేద్కర్ నుంచి షా హతీమ్ వరకు వరద నీటి కాల్వల బలోపేతం కోసం రూ.31.92 కోట్లు ఖర్చు చేయనున్నారు. బల్కాపూర్ నాలా రీస్టోరేషన్కు రూ. 56.34 కోట్లు , అఫ్జల్సాగర్ నాలాకు రూ.12 కోట్లు ఖర్చు చేయనున్నారు. నదీంకాలనీ వాసులకు ముంపు నుంచి శాశ్వత పరిష్కారం లభించనుంది. వీటితో పాటు విరాసత్నగర్, అహ్మద్కాలనీ, సాహతీమ్ పహాడ్, కేశవ్స్వామి నగర్, దుర్గానగర్, ఎంఎస్ మక్తా, బీఎస్ మక్తా, టౌలీచౌకీ, జానకీనగర్ వాసులకు ఉపశమనం లభించనుంది.
ఎర్రకుంట నుంచి కొత్త చెరువు వరకు రూ.26.19 కోట్లు, సింగరేణి కాలనీ నుంచి సరూర్నగర్ లేక్ వరకు రూ. 8.74 కోట్లతో నిర్మాణాలు చేపట్టనున్నారు.
అప్పా చెరువు నుంచి ముల్గుండు చెరువు వరకు వరద నీటి కాల్వల బలోపేతానికి రూ.8.54 కోట్లు, ముల్గుండు చెరువు నుంచి ఈసర్ రివర్ వరకు రూ.42.14 కోట్లతో పనులు చేపడతారు. గాజుమిల కాలనీ, హసబ్ బాబా నగర్, చాంద్రాయణగుట్ట , హఫీజ్ బాబా నగర్, ఫలక్నుమా, బండ్లగూడ, జైన్బజార్, అరుంధతి కాలనీ, నంది ముస్లాయిగూడ, పురానాపూల్, హసమాబాద్ ప్రాంతాలకు, గాజీ మిల్లత్ కాలనీ, అల్జుబే కాలనీ, అల్నూర్ కాలనీ, నిర్మాకాలనీ, కృష్ణారెడ్డి నగర్, సాదత్నగర్, పార్వతీనగర్, అల్జజీరా కాలనీ, ముర్గీచౌక్, మీరాలం ప్రాంత వాసులకు ముంపు సమస్య తొలగిపోనుంది.
నెక్నాంపూర్ నాలా నుంచి మూసీ రివర్ వరకు రూ.24 కోట్లు, రాయసముద్రం నుంచి నక్కవాగు వరకు రూ.5 కోట్లు, ఈర్ల చెరువు నుంచి ఎన్హెచ్ 65 వరకు రూ.15.88 కోట్లు, ఏజీ కాలనీ నుంచి లక్ష్మీ కాంప్లెక్స్ క్రాస్ ఎన్హెచ్ 65 ఎర్రగడ్డ వరకు రూ.12.86 కోట్లు ఖర్చు చేయనున్నారు. లింగంపల్లి తారానగర్, గుల్మోర్కాలనీ, రైల్వే విహార్ఫేజ్-1, చందానగర్ దీప్తిశ్రీనగర్, హుడా కాలనీ, ఫతేనగర్, శాస్త్రీనగర్, భరత్నగర్, మదీనాగూడ రామకృష్ణానగర్, నీలిమ చెగూరి ఎన్క్లేవ్ ప్రాంతాలకు శాశ్వతంగా ముంపు సమస్య తొలగిపోయినట్లేనని అధికారులు చెబుతున్నారు.
ఇండో అమెరికన్ స్కూల్ నుంచి మంత్రాల చెరువు-రూ.6.30 కోట్లు, పెద్ద చెరువు నుంచి మంత్రాల చెరువు – రూ.6.56 కోట్లు, మంత్రాల చెరువు నుంచి చందన చెరువు – రూ.6.30 కోట్లు, టీచర్ కాలనీ రోడ్డు నెంబరు 15 నుంచి గాయత్రీ నగర్ (వయా నంది హిల్స్, టీకేఆర్ గేట్) – రూ.27.43 కోట్లు
గణేష్ నగర్, లక్ష్మీనగర్, ఆర్.ఎన్.రెడ్డి నగర్, టెలిఫోన్ కాలనీ, మారుతి నగర్, జిలెల్లగూడ గాయత్రీ నగర్, శ్రీధర్ కాలనీ.. నందనవనం దిగువ భాగంలో నందిహిల్స్ వరకు, ప్రశాంత్హిల్స్ మూడు ఫేజులు, మురళీకృష్ణ నగర్, ఎంఎల్ఆర్ కాలనీ, లెనిన్ నగర్ (పాక్షికం), బాలాజీ కాలనీ, హుడా కాలనీ, కమలానగర్, దాసరి నారాయణ కాలనీ, శ్రీధర్ కాలనీ, సత్యసాయి నగర్, తదితర ప్రాంతాలు
కోమటికుంట నుంచి మీర్పేట తలాబ్ – రూ.9.66 కోట్లు, పోచమ్మ కుంట నుంచి మీర్పేట తలాబ్ – రూ.14.28 కోట్లు ముంపు తప్పే ప్రాంతాలు… సౌభాగ్యపురం, సీవైఆర్ కాలనీ, సీఎంఆర్ కాలనీ, రామిడి హిల్స్, రామిడి కళావతి నగర్, బీఎస్ఆర్ నగర్, సాయిబాలాజీ టౌన్షిప్, నవయుగ కాలనీ, మధురాపురి కాలనీ, వెంకటేశ్వర కాలనీ, బోయపల్లి ఎన్క్లేవ్, తదితర ప్రాంతాలు
మామిడిపల్లి నుంచి ఉమ్డా సాగర్ – రూ.14.19 కోట్లు, కొత్తమాని కుంట నుంచి గుర్రం చెరువు – రూ.10.66 కోట్లు ముంపు తప్పే ప్రాంతాలు…ఉస్మాన్నగర్, షాహిన్ నగర్, వాదేముస్తాఫా, రాయల్కాలనీ మరో కాలనీ… తదితర ప్రాంతాలు
పెద్ద చెరువు నుంచి పోచమ్మకుంట వరకు – రూ.32.42 కోట్లు ముంపు తప్పే ప్రాంతాలు…ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద సాఫీగా మూసీలోకి వెళ్లేందుకు మార్గం సుగమమవుతుంది. దీంతో పాటు భూదాన్ కాలనీ, కుంట్లూరు ఎస్సీ కాలనీ, కళానగర్, పసుమాముల పరిధిలోని ప్రాంతాల్లో ముంపు తప్పుతుంది.
పాపయ్య కుంట నుంచి బాలాజీ టవర్స్ – రూ.2.20 కోట్లు, ఆచార్య కుంట నుంచి బాటా జంక్షన్ వరకు రూ. 3.66 కోట్లు, బాలాజీ కాలనీ నుంచి బాటా జంక్షన్ వరకు రూ.3.69 కోట్లు, బాటా జంక్షన్ నుంచి బాలాజీ టవర్స్ వరకు రూ.5.69 కోట్లు, బండారి లేఅవుట్ నుంచి సాయి భాస్కర్ నెస్ట్-2 వరకు – రూ.7.35 కోట్లు, కేజీఎం ఎన్క్లేవ్ నుంచి కోకాకోలా వరకు రూ.53.57 కోట్లు, శ్రీకృష్ణాజీ హిల్స్ నుంచి క్విన్ ఇండియా వరకు రూ.4.68 కోట్లు, భవ్యాస్ ఆనందం నుంచి లేక్ రిడ్జ్ వరకు రూ.3.17 కోట్లు, మొండికుంట నుంచి ఎస్సారార్ వరకు రూ.0.62 కోట్లు ముంపు తప్పే ప్రాంతాలు..
నిజాంపేట మీదుగా జేఎన్టీయూ వెళ్లే మార్గం, బాలాజీనగర్, బండారి లేఅవుట్, ఈశ్వర్ విల్లాస్, శ్రీనివాసకాలనీ, కేటీఆర్ కాలనీ, ప్రగతి నగర్, రెడ్డి ఎవెన్యూ, మధురానగర్, గ్రీన్ఫీల్డ్ కాలనీ, వర్టెక్స్ నుంచి నల్లపోచమ్మ ఆలయం, శ్రీనివాస హౌసింగ్ సొసైటీ, ఇన్కాయిస్ చౌరస్తా, నిజాంపేట, రాజీవ్గాంధీ నగర్ ప్రధాన రహదారులు