హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ) : హుజూరాబాద్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ దక్కదని పాడి కౌశిక్రెడ్డి చెప్పారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి దమ్ముంటే హుజూరాబాద్లో డిపాజిట్ తెచ్చుకోవాలని సవాల్ విసిరారు. రాబోయే ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పోలింగ్ బూత్లలో కూర్చోవటానికి కనీసం ఏజెంట్లు కూడా ఉండరని జోస్యం చెప్పారు. హుజూరాబాద్ ఉపఎన్నికల్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాల్సిన కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకులే బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ను గెలిపించేందుకు లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. హైదరాబాద్లోని తన నివాసంలో కౌశిక్రెడ్డి సోమవారం విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పీసీసీ అధ్యక్షుడు రేవంత్పై నిప్పులు చెరిగారు. రేవంత్రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా నియమితులై 20 రోజులు అవుతున్నా హుజూరాబాద్ ఎన్నికపై సమీక్ష చేయలేదని, ఆయన బీజేపీకి అమ్ముడుపోవటమే ఇందుకు కారణమని ఆరోపించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను కంటికిరెప్పలా కాపాడుకుంటూ ఈటల రాజేందర్ను ఎదుర్కొన్నానని, ఇప్పుడు అదే ఈటల గెలుపుకోసం కాంగ్రెస్ నేతలు బీజేపికి సహకరిస్తున్నారని, అందుకే తాను పార్టీకి రాజీనామా చేశానని వివరించారు. కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఉంటూ బీజేపీ అభ్యర్థి గెలవాలని కోరుకునే రేవంత్ ఆ పదవిలో కొనసాగటం సిగ్గుచేటన్నారు. కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ను అభ్యర్థిగా నిలుపుతానని పేర్కొనటమే రేవంత్రెడ్డి అమ్ముడుపోయాడని చెప్పేందుకు నిదర్శనమని చెప్పారు. కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో తన వార్డులో కాంగ్రెస్ అభ్యర్థికి డిపాజిట్ కూడా తెచ్చుకోలేని పొన్నం ప్రభాకర్ను హుజూరాబాద్ అభ్యర్థిగా ఎలా నిలబెడతారని ప్రశ్నించారు. హుజూరాబాద్లో ఎన్నికల వేడి రగులుతూ మిగతా పార్టీలన్నీ ఇల్లిల్లూ తిరుగుతుంటే.. రేవంత్ కనీసం సమావేశం కూడా నిర్వహించకపోవటానికి కారణం ఏమిటని ఆయన ప్రశ్నించారు.
‘రేవంత్ అమ్ముడుపోయాడు’
ఈటల రాజేందర్ కాంగ్రెస్లో చేరితే బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచేవాళ్లమని రేవంత్ పేర్కొనటంలో ఆంతర్యం ఏమిటో బహిర్గతం చేయాలని నిలదీశారు. ఎస్సీల భూములను చట్టవ్యతిరేకంగా అక్రమించుకొని అడ్డంగా దొరికిపోయిన దొంగ ఈటల రాజేందర్ను టీఆర్ఎస్ బయటికి వెల్లగొడితే, అటువంటి దొంగ కాంగ్రెస్లో చేరితే బాగుండు అని ఆశపడటంలోని ఆంతర్యం అమ్ముడుపోవటమేనని ఆయన తేల్చిచెప్పారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మాణిక్యం ఠాగూర్కు రూ.50 కోట్లు ఇచ్చి పీసీసీ పదవిని చెచ్చుకున్న రేవంత్ వ్యవహార సరళి నచ్చకే తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఆయన చెప్పారు. 2018లో కొడంగల్లో రేవంత్కు ఎన్ని ఓట్లు వచ్చాయో తనకు హుజూరాబాద్లో అన్నే వచ్చాయని ఆయన పేర్కొన్నారు. హుజూరాబాద్లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో చర్చించి రెండు మూడు రోజుల్లో తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని చెప్పారు.