హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను తిరస్కరించలేదని తిరుమల తిరుపతి దేవస్థానం ఆదివారం ఒక ప్రకటనలో స్పష్టంచేసింది. లేఖలను తిరస్కరిస్తున్నట్టు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నది. తెలంగాణ ప్రజాప్రతినిధులకు దర్శనం విషయం లో గత విధానాలనే ఇప్పుడు కూడా అమలుచేస్తున్నామని వెల్లడించింది. వీఐపీ బ్రేక్ దర్శనం సమయం తక్కువగా ఉండటంతో ప్రజాప్రతినిధుల నుంచి కోటాకు మించి వచ్చిన లేఖలను మాత్రమే తిరస్కరించినట్టు తెలిపింది. కొందరు నాయకులు ఫోన్ చేసి తమ కు ముఖ్యమైన వారని చెప్పడంతో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు మంజూరుచేసి, స్వామివారి దర్శనం కల్పించామని గుర్తుచేసింది. గదుల కేటాయింపునకు సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపింది.
భక్తులను మోసగించిన 27 మంది అరెస్టు
తిరుపతి రైల్వేస్టేషన్, బస్టాండ్లో నకిలీ టికెట్లతో భక్తులను మోసగించిన 27 మంది దళారులను అరెస్టు చేసినట్టు ఏఎస్పీ మునిరామయ్య తెలిపారు. వీఐపీ టికెట్లను అధిక ధరలకు విక్రయించిన ఇద్దరు దళారులపై కేసులు నమోదుచేశామని పేర్కొన్నారు.
10 నిమిషాల్లోనే మొత్తం టికెట్లు బుక్
శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ విడుదల చేసిం ది. ఉదయం 9 గంటలకు టికెట్లు విడుదలచేయగా 9.10కే మొత్తం టికెట్లు బుక్ అయ్యాయి. ఈ నెల 13, 16 తేదీలకు సంబంధించిన టికెట్లను టీటీడీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ఇప్పటికే జూలై టికెట్లు రోజుకు ఐదువేల చొప్పున విడుదల చేసింది.