థియేటర్లు తెరుచుకునేందుకు ప్రభుత్వం పూర్తిగా అనుమతులు జారీ చేసిన కూడా ఇప్పటి వరకు తెలంగాణలో ఓపెన్ కాలేదు. 100% ఆక్యుపెన్సీతో థియేటర్లు ఓపెన్ చేయొచ్చు అని ఇప్పటికే ప్రభుత్వం చెప్పింది. అయినా కూడా డిస్ట్రిబ్యూటర్లు సిద్ధంగా లేరు. ఇలాంటి సమయంలోనే నిర్మాతలకు మరో షాక్ ఇచ్చారు తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు. డిస్ట్రిబ్యూటర్లతో నిర్మాతలు, సినీ ప్రముఖులు సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. థియేటర్లను తెరిచే అంశంపై చర్చలు జరిపారు. అయితే అందుకు డిస్ట్రిబ్యూటర్లు ససేమిరా అన్నారు. ఓటీటీల వల్ల ఈ రోజుల్లో థియేటర్లు తీవ్ర నష్టాలను చవి చూస్తాయని… వాటి నుంచి థియేటర్లను రక్షించాలని డిస్ట్రిబ్యూటర్లు కోరుకుంటున్నారు.
ఒక సినిమా తెరకెక్కించిన తర్వాత దాన్ని థియేటర్లలో విడుదల చేయడం పద్ధతి అని.. అలా కాదని ఓటీటీల్లో విడుదల చేస్తే థియేటర్లను తెరిచే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. డిస్ట్రిబ్యూటర్ నిర్ణయంతో నిర్మాతలకు షాక్ తగిలింది. ఈ నిర్ణయంతో నిర్మాతలకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇప్పటికే తమ సినిమాలను ఓటీటీలో విడుదల చేసేందుకు పలువురు నిర్మాతలు రెడీ అవుతున్నారు. ఇలాంటి సమయంలో థియేటర్లు తెరవడానికి డిస్ట్రిబ్యూటర్లు నో చెప్పడంతో అసలు సమస్యలు ఇప్పుడే మొదలయ్యాయి.
ఈ సమావేశంలో చాలా విషయాలపై చర్చ జరిగింది. ఈ క్రమంలోనే కొత్త సినిమాలను ఓటీటీలకు ఇవ్వడం ఆపాలని నిర్మాతలను కోరుతూనే.. మరో పక్క కరెంటు బిల్లుల రద్దు, టికెట్ల రేట్ల విషయంలో వెసులుబాటు లాంటి డిమాండ్లను ప్రభుత్వాల ముందు ఉంచుతున్నారు. వీటన్నింటి గురించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది. అన్నింటిపై ఒక నిర్ణయం వచ్చిన తర్వాత కానీ థియేటర్లు తెరవకూడదు అని డిస్ట్రిబ్యూటర్లు నిర్ణయించుకున్నారు. అన్ని సానుకూలంగా అనిపిస్తే జూలై 23న థియేటర్లను పున ప్రారంభించేందుకు ఎగ్జిబిటర్లు ఫిక్సైనట్లు తెలుస్తుంది.