నమస్తే నెట్వర్క్ : పల్లె, పట్టణ ప్రగతి పనులు శుక్రవారం జోరుగా సాగాయి. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్, హన్మకొండ పలివేల్పులలో రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మొక్కలు నాటారు. గ్రేటర్ వరంగల్లోని 11, 29వ డివిజన్లలో చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, మేయర్ గుండు సుధారాణితో కలిసి రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ మొక్కలు నాటారు. మహబూబాబాద్ మండలం కంబాలపల్లిలో పల్లె ప్రకృతి వనాన్ని కలెక్టర్ వీపీ గౌతమ్తో కలిసి అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రియాంక వర్గీస్ సందర్శించి మొక్కలు నాటారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం రేపోణిలో డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ మొక్కలు నాటి, వేములపల్లిలో శ్మశానవాటికను ప్రారంభించారు. వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలంలోని గర్మిళ్లపల్లి దళితవాడలో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మూడు గంటల పాటు పర్యటించి ప్రజలతో మమేకమయ్యారు.
సమస్యల పరిష్కారానికి తన వంతు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. మహబూబాబాద్ మండలం మల్యాలలో రోడ్ల వెంట పిచ్చిమొక్కలు, నిల్వ నీటిని ఎమ్మెల్యే శంకర్నాయక్ శుభ్రం చేయించారు. వరంగల్ రూరల్ జిల్లా దుగ్గొండి మండలం బిక్కాజిపల్లి, శివాజీ నగర్లో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి పల్లె ప్రగతి పనులను పరిశీలించి మొక్కలు నాటారు. పరకాల పట్టణంలోని బస్టాండ్ సర్కిల్లో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మొక్కలు నాటారు. భూపాలపల్లిలోని జంగేడులో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రగతి పనులను పర్యవేక్షించారు.