మిర్యాలగూడ రూరల్, జూలై 7 : రైతులు వరికి ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని, అప్పుడే వారిని లక్షాధికారులను చేయాలన్న సీఎం కేసీఆర్ కల నిజమవుతుందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని యాద్గార్పల్లిలో వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డులను ప్రారంభించారు. అనంతరం ఊట్లపల్లిలో పల్లె ప్రకృతి వనం, రైతు వేదికను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ దేశంలో వరి దిగుబడిలో పంజాబ్ను అధిగమించి ప్రథమ స్థానంలో నిలిచామని తెలిపారు. రైతులంతా కూరగాయలు, పండ్ల తోటలు, పప్పు ధాన్యాలు పలు రకాల సాగు చేసి బంగారం లాంటి పంటలను పండించాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు, మాజీ ఎమ్మెల్యే, జడ్పీటీసీ విజయసింహారెడ్డి, ఎంపీపీ నూకల సరళాహన్మంతరెడ్డి, ఏఎంసీ చైర్మన్ రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు రాంచందర్నాయక్, సర్పంచులు శ్రీనివాస్, శ్రీలతావిక్టర్ పాల్గొన్నారు.
మొక్కల పెంపకం ఉద్యమంలా చేపట్టాలి
దామరచర్ల : మొక్కల పెంపకం ఒక ఉద్యమంలా చేపట్టాలని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. మండలంలోని నూనావత్ తండా గ్రామ పంచాయతీ పరిధిలోని పంచపాండవుల ప్రకృతి వనంలో పది ఎకరాల విస్తీర్ణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని భేరీ మోగించి ప్రారంభించారు. సుమారు 2వేల మంది ప్రజలు పాల్గొని పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. మండలంలో ఐదు గ్రామాలను కలిపి పంచపాండవుల వనాన్ని ఏర్పాటు చేయడం మంచి కార్యక్రమన్నారు. అనంతరం రాజగట్టు, వాడపల్లి, ఇర్కిగూడెం గ్రామాల్లో వైకుంఠధామాలను ప్రారంభించారు. పల్లె ప్రకృతి వనాలను పరిశీలించారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే భాస్కర్రావు, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ డీ.నారాయణరెడ్డి, ఎంపీపీ నందిని, జడ్పీటీసీ లలిత, వైస్ ఎంపీపీ సైదుల్రెడ్డి, వీరకోటిరెడ్డి పాల్గొన్నారు.
లాభసాటి వ్యవసాయం చేయాలి
పాలకవీడు/ నేరేడుచర్ల : ఆయకట్టు రైతులు వరికి ప్రత్యామ్నాయ పంటలు పండించాలని, లాభసాటి వ్యవసాయం చేయాలని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. మండలంలోని గుడుగుంట్లపాలెంలో జరిగిన పల్లె ప్రగతి అభివృద్ధి పనులను హుజూర్నగర్ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డితో కలిసి పరిశీలించారు. అనంతరం గ్రామంలోని రైతు వేదిక వద్ద మొక్కలు నాటారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో సమావేశమై వ్యవసాయంపై పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో పీడీ కిరణ్కుమార్, ఆర్డీఓ వెంకారెడ్డి, ఎంపీపీ భూక్యా గోపాల్, జడ్పీటీసీ మాలోతు బుజ్జి, సర్పంచ్ కిష్టపాటి అంజిరెడ్డి, రైతు బంధు సమితి జిలా ్లకమిటీ సభ్యుడు మలమంటి దర్గారావు, దేవిరెడ్డి వెంకటరెడ్డి, యరెడ్ల సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు. అనంతరం నేరేడుచర్లలో పట్టణ ప్రగతి పనులను పరిశీలించారు. హరితహారంలో భాగంగా 14వ వార్డులో మొక్కలు నాటి నూతన చెత్త సేకరణ వాహనాలను ప్రారంభించారు. మున్సిపల్ చైర్మన్ జయబాబు, వైస్ చైర్పర్సన్ చల్లా శ్రీలతారెడ్డి, డీసీసీబీ జిల్లా డైరెక్టర్ దొండపాటి అప్పిరెడ్డి పాల్గొన్నారు. కౌన్సిలర్లు బాషా, నాగవేణి, లలిత, సులోచన టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
రైతులతో మంత్రి ముఖాముఖి
పాలకవీడు మండలంలోని గుడుగుంట్లపాలెం గ్రామంలో పల్లెప్రగతి పనులను పరిశీలించిన అనంతరం మంత్రి జగదీశ్రెడ్డి, హుజూర్నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి గ్రామస్తులు, రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆసక్తి చర్చ జరిగింది.
మంత్రి: పల్లె ప్రగతి పనులు బాగా జరిగాయా?
గ్రామస్తులు : మంచిగా జరిగాయి సార్.
మంత్రి : శ్రమదానం చేశారా?
గ్రామస్తులు : గత ఏడాది నిర్వహించాం. ఈ ఏడాది చేయలేదు సార్.
మంత్రి : ఎందుకు చేయలేదు. గ్రామమంతా అభివృద్ధి జరిగిందా. ఇంక అవసరం లేదా?
గ్రామస్తులు : కావాలి సార్.
మంత్రి : గ్రామంలోని ప్రతి ఇంట్లో ఆరు మొక్కలు పెంచుతున్నారా?
గ్రామస్తులు : 70 శాతం పెంచుతున్నాం సార్.
మంత్రి : నేను వచ్చి పరిశీలించనా?
గ్రామస్తులు : పరిశీలించడండి సార్.
అనంతరం మంత్రి మాట్లాడుతూ గ్రామస్తులంతా ఐక్యంగా ఉండి పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.