జమ్మికుంట, జూన్ 29: ‘ఈటల రాజేందర్ టీఆర్ఎస్లో ఉండి పదవులన్నీ అనుభవించిండు. ఏమన్నా పోగొట్టుకున్నడా.. ఏంది?. వేల కోట్లు, వందల ఎకరాలు సంపాదించుకున్నడు. ప్రజలను ఇబ్బంది పెడుతున్న బీజేపీలో చేరిండు. ఆయనకు మనమెందుకు ఓటెయ్యాలే..? ఆలోచించండి’ అని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు సూచించారు. మంగళవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని పీవీఆర్ గార్డెన్లో మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్రావు ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక 12వ వార్డు కౌన్సిలర్ మొలుగు ప్రణీత, కాంగ్రెస్ నాయకుడు మొలుగు దిలీప్తోపాటు మరో 500 మంది టీఆర్ఎస్లో చేరగా మంత్రులు గులాబీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ… సంక్షేమం, అభివృద్ధికే పట్టం కట్టాలని కోరారు. ఇంటి పార్టీ టీఆర్ఎస్కే అండగా ఉండాలని మంత్రి గుంగుల కోరారు. రాబోయే ఎన్నికల్లో మతతత్వ పార్టీ బీజేపీ తగిన గుణపాఠం చెప్పాలని, కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలని ఆయన పిలుపునిచ్చారు.