బాబీసింహా కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘వసంత కోకిల’. రమణన్ పురుషోత్తమ దర్శకుడు. రజనీ తాళ్లూరి, రేష్మి సింహా నిర్మాతలు. కశ్మీర పరదేశీ కథానాయిక. శుక్రవారం టీజర్ను చిత్రబృందం విడుదలచేసింది. ఓ ప్రేమజంటకు ఎదురైన అనూహ్య పరిణామాలతో టీజర్ ఉత్కంఠను పంచుతోంది. నిర్మాతలు మాట్లాడుతూ ‘రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రమిది. తమ జీవితంలోని ఎదురైన కన్ఫ్యూజన్స్, ప్రశ్నలకు సమాధానాల్ని వెతుక్కుంటూ ఓ యువజంట సాగించిన ప్రయాణమే ఈ చిత్ర ఇతివృత్తం. బాబీసింహా నటన, పాత్రచిత్రణ సరికొత్తగా ఉంటాయి. ఆద్యంతం ఊహకందని మలుపులతో ఆసక్తికరంగా సినిమా సాగుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాల్ని త్వరలో వెల్లడిస్తాం’ అని తెలిపారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: గోపీ అమరనాథ్, సంగీతం: రాజేష్ మురుగేషన్.