హైదరాబాద్ : బకాయిల వసూలు, సర్ధుబాటుకు రైతుబంధు నగదు జమచేయవద్దని అన్ని శాఖల బ్యాంకర్లకు ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. రైతుబంధు నిధులను కొన్ని బ్యాంకులు రుణబకాయిలకు జమ చేసుకోవడంపై బ్యాంకర్లతో మంత్రి హరీశ్రావు, సీఎస్ సోమేశ్ కుమార్ మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. సీఎం ఆదేశాల మేరకు బ్యాంకర్లతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంకర్లు స్పందిస్తూ తాము ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదన్నారు. దీనిపై మంత్రి హరీశ్ స్పందిస్తూ.. రైతుబంధు నగదును ఎట్టి పరిస్థితుల్లో ఆపరాదన్నారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లు పర్యవేక్షించాలని ఆదేశించారు. రైతుల కోసం టోల్ ఫ్రీ నంబర్లు.. 18002001001, 040 33671300 ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు ఇవి పనిచేయనున్నట్లు తెలిపారు. పంట రుణాలు, రెన్యువల్ మంజూరును వేగవంతం చేయాలని బ్యాంకర్లను మంత్రి ఆదేశించారు.