న్యూఢిల్లీ, జూన్ 20: కొవిడ్ నిబంధనలు పాటించకపోతే, జాగ్రత్తలు తీసుకోకపోతే డెల్టా ప్లస్ వేరియంట్ ఆందోళనకరమైనదిగా పరిణమించే ప్రమాదం ఉందని ఎయిమ్స్ చీఫ్ రణ్దీప్ గులేరియా హెచ్చరించారు. యూకేలో కేసులు మళ్లీ పెరుగుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. యూకే నుంచి భారత్ పాఠాలు నేర్చుకోవాలన్నారు. ‘యూకే కఠినమైన లాక్డౌన్తో కరోనాను కట్టడి చేసింది. కొద్దికొద్దిగా ఆంక్షలు ఎత్తేస్తున్న క్రమంలో డెల్టా వేరియంట్ కారణంగా అక్కడ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఇండియాలోనూ ఆంక్షలు సడలిస్తున్నారు. యూకేను చూసి పాఠాలు నేర్చుకోవాలి. 3-4 నెలలు జాగ్రత్తగా ఉండాలి’ అని సూచించారు. కొవిడ్ నిబంధనలు పాటించకపోతే కొన్నివారాల్లో ఇండియాలోనూ కేసులు పెరిగే ప్రమాదం ఉందన్నారు.