విద్యానగర్, జూన్ 17: ప్రతి పేదింటి బిడ్డ చదువుకునేందుకు పుష్కలమైన వనరులు అందుబాటులోకి తెచ్చింది తెలంగాణ సర్కారు. కార్పొరేట్ స్థాయి హంగులతో తీర్చిదిద్దిన ప్రభుత్వ విద్యాలయాలతో పేదవర్గాల చిన్నారులకు కొండంత అండ దొరికినట్లు అయ్యింది. అందనంత దూరంగా ఉన్న కార్పొరేట్ స్థాయి విద్య, వసతులన్నీ ప్రతి జిల్లాలో ఉచితంగా దరి చేరుతున్నాయి. ఆర్థికంగా వెనుకబడిన వారు, తల్లిదండ్రులు లేని వారు, నిరుపేద విద్యార్థినులు, వివిధ సమస్యల కారణంగా చదువును కొనసాగించలేని వారికోసం కేజీబీవీలు నెలకొల్పారు. ఇందులో ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు తరగతి, ఇంటర్ తరగతులు కొనసాగిస్తున్నారు. ఒక్కో పాఠశాలలో సుమారు 200 మంది, ఇంటర్లో 160 మంది విద్యార్థినులు ఉన్నారు. ప్రత్యేకంగా బోధకుల నియామకంతోపాటు ఉచిత భోజన, వసతి, పుస్తకాలు తదితర అన్ని సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తున్నది. కంప్యూటర్ కోర్సులు, కరాటే శిక్షణతోపాటు ఆంగ్ల భాష నేర్చుకోవడం, బృంద చర్చలు, నృత్యాలు, చిత్రలేఖనం వంటి వాటిపై ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తున్నారు. జీవితంలో ఏదైనా సాధించేలా, ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేలా వారిని తీర్చిదిద్దుతున్నారు. వృత్తి విద్యలోనూ శిక్షణ ఇస్తున్నారు. గ్రామాల్లో ఆసరా కోల్పోయిన బాలికలు కేజీబీవీ చదువులతో ప్రగతి సాధిస్తున్నారు.
కేజీబీవీలో 1480 సీట్లు ఖాళీలు
కరోనా కారణంగా పదోతగరతి పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్థులంతా పాసయ్యారు. ఇంటర్ విద్యార్థులు సైతం ప్రమోట్ అయ్యారు. దీంతో ఖాళీ అయిన సీట్లను భర్తీ చేసేందుకు కస్తూర్బాలో ఆరోతరగతి, ఇంటర్ ప్రథమ సంవత్సరానికి సంబంధించి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఆసక్తి ఉన్నవారు తమ వివరాలతో కస్తూర్బా ఎస్వోలకు ఫోన్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు. కళాశాలలో చేరాలనుకునే వారు పదోతరగతిలో సాధించిన జీపీఏ గ్రేడ్ మార్కులు, ఇతర వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది. మొదట అనాథ బాలికలకు, పేదింటి పిల్లలకు అవకాశం కల్పిస్తారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 19 కేజీబీవీల్లోని ఒక్కొక్క పాఠశాలలో 40 సీట్లు ఉండగా, మొత్తం 760 సీట్ల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇంటర్మీడియెట్ విభాగంలో ఒక్కో కళాశాలలో 80 చొప్పున తొమ్మిది కళాశాలల్లో 720 సీట్లు ఖాళీగా ఉన్నాయి. కేజీబీవీలో ప్రవేశానికి జూలై చివరి వారం, ఇంటర్లో ప్రవేశాలకు జూలై 5వ తేదీ వరకు దరఖాస్తు గడువు విధించారు.
19 కేజీబీవీలు.. 9 ఇంటర్ కళాశాలలు
కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 19 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలున్నాయి. 9 ఇంటర్ కేజీబీవీ కళాశాలలు ఉన్నాయి. 19 కేజీబీవీల్లో 3040 మంది విద్యార్థులు, 9 కళాశాలల్లో 720 మంది విద్యార్థులు ఇంటర్ సెకండియర్ విద్యను అభ్యసిస్తున్నారు. మొత్తం 3,760 వేల మంది విద్యార్థులు ఉన్నారు. కొంత కాలంగా పదో తరగతి ఫలితాల్లో కేజీబీవీల్లో ఉత్తీర్ణత శాతం మెరుగ్గా ఉంటోంది. ఇంటర్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంపీహెచ్డబ్ల్యూ కోర్సులు ఉన్నాయి. ప్రైవేటుకు దీటుగా విద్యార్థులు రాణిస్తుండడంతో ఇక్కడ సీటు సంపాదించడం కష్టంగానే మారుతోంది. దీనికి తోడుగా సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో బాలికలకు ఆరోగ్య కిట్లు అందిస్తుండడం, సౌకర్యాల కల్పనలోనూ కార్పొరేట్కు దీటుగా ఉండడంతో అందరి దృష్టి కేజీబీవీలపై కేంద్రీకృతమవుతోంది.
దరఖాస్తు చేసుకోవాలి
కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో బాలికలకు నాణ్యమైన విద్యతోపాటు వసతి కల్పిస్తున్నది. ఆసక్తి ఉన్న పేద,మధ్యతరగతి బాలికలు ఆన్లైన్ ద్వారా లేదా ఎస్వోలకు ఫోన్ ద్వారా తమ వివరాలను తెలియజేసి అడ్మిషన్లు పొందాలి.
-గంగాకిషన్, జిల్లా కోఆర్డినేటర్