పరిగి, మే 25: మినరల్ ఫండ్తో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, డీఎంఎఫ్సీ చైర్పర్సన్ పి.సబితారెడ్డి తెలిపారు. మంగళవారం వికారాబాద్ డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ కమిటీ సమావేశాన్ని నగరంలోని మంత్రి కార్యాలయం నుంచి గూగుల్ మీట్ ద్వారా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వికారాబాద్ జిల్లాలో రూ.62 కోట్ల విలువైన పనులు చేపడుతున్నట్లు చెప్పారు. పాడైన ఆర్అండ్బీ రోడ్ల మరమ్మతులకు రూ.7.10 కోట్లు, కొవిడ్ దృష్ట్యా సీఎంఆర్ఎఫ్కు రూ.8.66 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. తాండూరు నియోజకవర్గానికి రూ.14కోట్లు, వికారాబాద్ శివసాగర్ ప్రాజెక్ట్ కట్ట నిర్మాణానికి రూ.కోటి, కొడంగల్ నియోజకవర్గానికి రూ.30లక్షలతో వివిధ పనులు చేపట్టడానికి సమావేశం ద్వారా కమిటీ ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. పరిగిలోని ఇండోర్ స్టేడియంలో సదుపాయాల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ను ఆదేశించారు. వానకాలం సమీపిస్తున్నందున రోడ్ల మరమ్మతులు త్వరగా పూర్తి చేయాలన్నారు. మైనింగ్ ఉన్న గ్రామాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. సమావేశంలో ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యేలు కొప్పుల మహేశ్రెడ్డి, మెతుకు ఆనంద్, కాలె యాదయ్య, పట్నం నరేందర్ రెడ్డి, పైలెట్ రోహిత్రెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, కలెక్టర్ పౌసుమి బసు పాల్గొన్నారు.