న్యూఢిల్లీ, మే 19: కొత్తరూపాలను సంతరించుకుంటున్న కరోనా వైరస్ను ఎదుర్కోవటానికి చికిత్సలో కూడా రోజురోజుకూ నూతన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కొవిడ్-19 చికిత్స విధానం నుంచి కాన్వలసెంట్ ప్లాస్మా థెరపీని తీసివేయాలంటూ ‘ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్’ (ఐసీఎంఆర్) ఇటీవల సిఫారసు చేయడం తెలిసిందే. ఇదేక్రమంలో యాంటీ వైరల్ డ్రగ్ రెమ్డెవిర్ను కూడా త్వరలో తీసివేయవచ్చని ఢిల్లీలోని గంగారామ్ దవాఖాన చైర్పర్సన్ డాక్టర్ డీఎస్ రాణా అభిప్రాయపడ్డారు. ‘కొవిడ్ చికిత్సకు రెమ్డెసివిర్ ఉపయోగపడుతుందనడానికి ఎలాంటి ఆధారంలేదు. కరోనా తీవ్రతను తగ్గించడానికి సాయపడని ఔషధాల వాడకాన్ని కొవిడ్-19 చికిత్స విధానం నుంచి తొలగించాలి’ అని రాణా అభిప్రాయపడ్డారు. ‘ప్లాస్మా థెరపీ లేదా రెమ్డెసివిర్ను త్వరలో కొవిడ్ చికిత్స జాబితా నుంచి తొలగిస్తారు. కరోనా చికిత్సలో ఈ ఔషధాలు పనిచేస్తున్నట్టు ఆధారాలు లేవు. ప్రస్తుతం కరోనా చికిత్సలో మూడు ఔషధాలు మాత్రమే పనిచేస్తున్నాయి’ అని ఆయన తెలిపారు. అయితే ఆ మూడు ఔషధాల పేర్లను పేర్కొనలేదు. కాగా కరోనా చికిత్సకు రెమ్డెసివిర్ సమర్థంగా పనిచేస్తున్నట్టు ఎలాంటి ఆధారాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) కూడా ఇప్పటికే ప్రకటించింది.