నివారణకు ప్రణాళిక.. బాధితులకు భరోసా
ఏరియా దవాఖానల్లో సకల వసతులు
పెద్దపల్లి, మే17 (నమస్తే తెలంగాణ)/గోదావరిఖని: బొగ్గు ఉత్పత్తిలో దూసుకెళ్తున్న సింగరేణి.. కోరలు చాస్తున్న కరోనాను కట్టడి చేసేందుకు పకడ్బందీ చర్యలు చేపడుతున్నది. నల్లనేల వ్యాప్తంగా కార్మికులు, కార్మిక కుటుంబాల శ్రేయస్సే లక్ష్యంగా బహుముఖ వ్యూహంతో ముందుకుసాగుతున్నది. ఓ వైపు బాధితులకు మెరుగైన వైద్యం, పౌష్టికాహారం, మెడికల్ కిట్లు అందిస్తూ భరోసా ఇస్తూనే, మరోవైపు 71కోట్లతో సింగరేణి ఏరియా దవాఖానల్లో అధునాతన వసతులు, 1400 పడకలు.. వెంటిలేటర్లు.. ఐదుచోట్ల ఆక్సిజన్ ప్లాంట్లు.. సిలిండర్లు.. ఇలా ఒక్కటేమిటి అనేక రకాల సౌకర్యాలు కల్పిస్తున్నది. ఎప్పటికప్పుడు టెస్టులు, వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తూనే, సీఎండీ శ్రీధర్ ఆదేశాలతో అవసరమైన చర్యలు తీసుకుంటున్నది.
కరోనా కట్టడికి సింగరేణి పకడ్బందీ చర్య లు చేపడుతున్నది. కోల్బెల్ట్ వ్యాప్తంగా గనులు విస్తరించి ఉన్న భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, కొమురంభీం అసిఫాబాద్ జిల్లాల్లో మొత్తం 44,469 మంది కార్మికులు ఉన్నారు. ఇక కార్మికుల కుటుంబ సభ్యులు, కాంట్రాక్ట్ కార్మికులతో చూసుకుంటే వీరి సంఖ్య లక్షకు పైనే ఉంటుంది. ఈ క్రమంలో సంస్థ కోసం పనిచేస్తున్న కార్మికుల శ్రేయస్సే లక్ష్యంగా సీఎం కేసీఆర్ దిశానిర్దేశంతో కరోనా కట్టడికి సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజిండ్ డైరెక్టర్ శ్రీధర్ యాక్షన్ ప్లాన్ను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. కొవిడ్ ప్రారంభం నుంచి ఇ ప్పటి వరకు కోట్లాది రూపాయలతో బాధితులకు భరోసా ఇస్తూనే, కార్మికులు, కార్మిక కుటుంబాల రక్షణకు చర్యలు తీసుకుంటున్నారు.
3.16కోట్లతో రాపిడ్ టెస్ట్ కిట్ల కొనుగోలు..
కరోనా వ్యాధి నివారణ చేయాలంటే ముందు గా ఎక్కువ మందికి పరీక్షలు చేయాలి. పాజిటివ్ వచ్చినవారిని ఐసొలేషన్ చేసి వైద్యం అందించి ఇతరులకు విస్తరించకుండా చూడాలన్న ప్రణాళికతో సింగరేణి ఇప్పటివరకు 3.16 కోట్లతో 1,25,250 ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షల కిట్లు కొనుగోలు చేసింది. ఇందులో ఇప్పటివరకు 99, 406 మందికి పరీక్షలు నిర్వహించింది.
అత్యవసర కేసులకు 38కోట్లతో వైద్యం..
సింగరేణిలో ఇప్పటివరకు 12,308 మందికి పాజిటివ్గా నిర్ధారణ కాగా, సింగరేణి వ్యాప్తంగా ఉన్న కరోనా ప్రత్యేక వార్డుల్లో, ఐసోలేషన్ సెంటర్లలో వైద్యసేవలు అందించింది. ఇందులో 9,93 8 మంది పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం వైద్యం పొందుతున్న వారు 2,267 మంది. సింగరేణిలో మొత్తం కార్మికుల సంఖ్య 44వేలు కాగా ప్రస్తుతం యాక్టివ్ కేసులుగా ఉండి వైద్యం పొందుతున్న కార్మికుల సంఖ్య కేవలం 783 మాత్రమే. మిగిలిన యాక్టివ్ కేసుల్లో 1,121 మంది కార్మికుల కుటుంబ సభ్యులు, 364 మంది కాంట్రాక్ట్ కార్మికులు. కాగా, ఇప్పటి వరకు హైదరాబాద్ కార్పొరేట్ దవాఖానల్లో అత్యవసర చికిత్స పొందిన 867 మంది కోసం సంస్థ 38కోట్లు వెచ్చించిం ది. ప్రస్తుతం 42మందికి హైదరాబాద్లో వైద్య సేవలు అందిస్తున్నారు.
10కోట్లతో ప్రత్యేక వార్డులు..
సింగరేణి క్వారంటైన్ సెంటర్లలో వైద్య సేవలు పొందే వారి కోసం వివిధ రకాల మందులు, పల్స్ ఆక్సీమీటర్ వంటి 18రకాల వస్తువులతో కూడిన కిట్లను అందజేస్తున్నది. సుమారు 80లక్షలతో ఈ కిట్లను కొనుగోలు చేసి క్వారంటైన్ సెంటర్లు, హోం ఐసొలేషన్లో ఉన్న రోగులకు ఇస్తున్నది. అలాగే సింగరేణి వ్యాప్తంగా ఉన్న దవాఖానలకు అవసరమైన రెమ్డెసివిర్ ఇంజక్షన్లు, పెవిపెరావిర్ మాత్రలు వంటి మందులను 5.55కోట్లతో కొ నుగోలు చేశారు. ఇక సింగరేణి వ్యాప్తంగా ప్రస్తు తం ఉన్న 692 పడకలకు అదనంగా మరో 736 పడకలను సమకూర్చి ప్రత్యేక వార్డులు, క్వారంటైన్ సెంటర్ల ఏర్పాటు కోసం సుమారు 43లక్షలు ఖర్చు చేసింది. తాజాగా 3.15కోట్లతో వెంటిలేటర్లు, మూడు వందల రకాల అత్యవసర వైద్య సేవల పరికరాలను కొనుగోలు చేయాలని, వెంటనే దవాఖానలకు అందజేయాలని యాజమాన్యం సంకల్పించింది.
4.88కోట్లతో ఆక్సిజన్ ప్లాంట్లు, సిలిండర్లు ..
సింగరేణి ఏరియా దవాఖానలలో ఆక్సిజన్ కొరత లేకుండా యాజమాన్యం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నది. ముందు జాగ్రత్త చర్యగా సుమారు 3.60కోట్ల వ్యయంతో ఐదు చోట్ల ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నది. గోదావరిఖని ఏరియా దవాఖాన, భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి, మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్, కుమ్రం ఆసిఫాబాద్ భీం జిల్లా బెల్లంపల్లిలోని సింగరేణి ఏరియా దవాఖానల్లో ఏర్పాటు చేయనున్నారు. ఈ ఆక్సిజన్ ప్లాంట్ల నుంచి రోజుకు 80నుంచి 100సిలిండర్ల ఆక్సిజన్ ఉత్పత్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్లాంట్లు ఆరు వారాల్లో అందుబాటులోకి రానున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఇప్పటికే ఉన్నవాటికితోడు అదనంగా మరో 370 ఆక్సిజన్ సిలిండర్లను 1.18కోట్లతో కొనుగోలు చేసి ఏరియా దవాఖానలకు పంపించారు.
బాధితులకు అండగా..
బాధితులకు యాజమాన్యం అండగా నిలుస్తున్నది. దవాఖానల్లో చికిత్స పొందుతున్నవారికి మంచి పౌష్టికాహారం అందిస్తున్నది. ఇందుకోసం ఇప్పటికే 1.50కోట్లు ఖర్చు చేసింది. వీటితో పా టు శానిటేషన్ లిక్విడ్, మాస్కులు, హ్యాండ్ శానిటైజర్లు వైద్యులకు కావలసిన పీపీఈ కిట్లు, మా స్కులు వంటివి కొనుగోలు చేసి అందజేసింది. అలాగే కొవిడ్ వార్డులకు అవసరమైన మరో 35మంది అదనపు డాక్టర్లు, 126మంది నర్సులు, 250మంది సిబ్బందిని కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించి వైద్య సేవలు అందిస్తున్నది.
వ్యాక్సినేషన్లో వేగం..
రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సింగరేణి వ్యాప్తం గా ఇప్పటికే 27,469మంది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, కాంట్రాక్ట్ కార్మికులకు వ్యాక్సినేషన్ను పూర్తి చేసింది. మరో 50వేల మందికి టీకాలు వేసేందుకు కసరత్తు చేస్తున్నది. తయారీ దారుల నుంచి నేరుగా కొనుగోలు చేసేందుకు రా ష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రయత్నిస్తున్నది. జూలై నెల కల్లా అందరికీ వ్యాక్సినేషన్ చేయించే లక్ష్యంతో ముందుకు పోతున్నది.
15లక్షల ఎక్స్గ్రేషియా..
కొవిడ్ కారణంగా మృతి చెందిన ఉద్యోగులకు ఒక్కొక్కరికీ 15లక్షల ఎక్స్గ్రేషియాను చెల్లిస్తున్నది. సింగరేణి కార్మికులు కాకుండా వారి కుటుం బ సభ్యులు, కాంట్రాక్టు కార్మికులకు కూడా వైద్య సేవలను అందిస్తున్నది. ‘ఎంత ఖర్చు అయినా పర్వాలేదు. సింగరేణి క్షేమంగా ఉండాలి.. అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోండి..’ అంటూ సీఎండీ శ్రీధర్ ఆదేశాలు జారీ చేయడంతో సింగరేణి తరపున సమర్థవంతంగా వైద్య సేవలు అందించగలుగుతున్నారు. సీఎండీ ఆదేశాలతో డైరెక్టర్లు, ఏరియా జనరల్ మేనేజర్లు కొవిడ్పై ప్రతి రోజు సమీక్షిస్తూ ఎప్పటికప్పుడు నిధులు మంజూరు చేస్తూ అంతా సజావుగా సాగేలా చూస్తున్నారు.
కార్మికుల శ్రేయస్సే ముఖ్యం..
సింగరేణిలో పనిచేస్తున్న ప్రతి బిడ్డనూ కాపాడుకోవడమే లక్ష్యంగా సీఎండీ శ్రీధర్ ప్రత్యేక చొరవ చూపుతున్నారు. కొవిడ్ ఆపత్కాలంలో అత్యవసర సేవల కోసం ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేస్తున్నారు. 71కోట్లతో యాక్షన్ ప్లాన్ చేసి అన్ని ఏర్పాట్లు చేశారు. అత్యవసరమైనవారికి హైదరాబాద్లో కార్పొరేట్ స్థాయి వైద్యం కూడా అందిస్తున్నాం. ఇంకా పేషెంట్లతో వాట్సప్లో కాన్ఫరెన్స్ పెట్టి నిత్యం వైద్యులు, సింగరేణి అధికారులు మాట్లాడుతూ కోలుకునే దాకా పర్యవేక్షిస్తున్నాం.