నారాయణఖేడ్, ఏప్రిల్ 1: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా విద్యాధికారి రాజేశ్ తెలిపారు. గురువారం ఆయన నారాయణఖేడ్ మండలంలోని హన్మంత్రావుపేట్, సంజీవన్రావుపేట్ ఉన్నత పాఠశాలలను తనిఖీ చేసిన సందర్భంగా నారాయణఖేడ్లోని ఎమ్మార్సీ భవనంలో విలేకరులతో మాట్లాడారు. కలెక్టర్ సహకారంతో మండలంలోని ఎనిమిది పాఠశాలల్లో సైన్స్ ల్యాబ్, డిజిటల్ తరగతులను ఏర్పాటు చేయడమే కాకుండా నారాయణఖేడ్లోని ఒక ఉన్నత పాఠశాలలో సైన్స్ మ్యూజియం ఏర్పాటు చేశామన్నారు. వాటిని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో ఆయా పాఠశాలలో సైన్స్ ల్యాబ్, డిజిటల్ తరగతులను పరిశీలించినట్లు తెలిపారు. డిజిటల్ తరగతులను ఇప్పటికే ప్రారంభించడం జరిగిందని, సైన్స్ ల్యాబ్కు సం బంధించిన సామాగ్రిని కూడా ఇటీవ లే అందుబాటులో కి వచ్చిందన్నారు. సైన్స్ మ్యూజియమ్ను కూడా త్వరలోనే ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సైన్స్ ల్యాబ్ నిర్వహణ, బోధనకు సంబంధించి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు తగు సూచనలు చేయడం జరిగిందన్నారు.