దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తున్నది. ఒకవైపు కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతుండగానే మరోవైపు మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ తదితర రాష్ర్టాల్లో కొత్త కేసులు ఆందోళనకర స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ పరిణామం ప్రజల్లో ఆందోళన పెంచుతున్నది. మరోవైపు టీకాలు తీసుకునే విషయంలోనూ లేని పోని అపోహలు, అనుమానాలు ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి. వాస్తవానికి ప్రస్తుతం మనదేశంలో ఇస్తున్న ఆక్స్ఫర్డ్ టీకా కొవిషీల్డ్, భారత్ బయోటెక్ టీకా కొవాగ్జిన్ రెండూ మంచివేనని, రెండింటికీ కొవిడ్ను ఎదుర్కొనగల సత్తా ఉన్నదని వైద్య నిపుణులు స్పష్టంచేస్తున్నారు.ఈ రెండు టీకాలు అనేక పరిశోధనల తర్వాతే ప్రజలకు వేస్తున్నారని గుర్తుచేస్తున్నారు.
హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): దేశంలో కరోనా వ్యాక్సినేషన్ నిరాటంకంగా సాగుతున్నది. స్వదేశీ టీకా కొవాగ్జిన్, విదేశీ టీకా కొవిషీల్డ్ను ప్రాధాన్యత క్రమంలో ప్రజలకు వేస్తున్నారు. కొవిడ్-19 బారినుంచి రక్షించుకొనేందుకు వ్యాక్సిన్ తీసుకోవడం ఉత్తమ మార్గం కావటంతో అందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి టీకాలు వేసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పదేపదే విజ్ఞప్తి చేస్తున్నాయి. అనేకమంది సానుకూలంగా స్పందించి, టీకా వేసుకునేందుకు ముందుకు వస్తున్నా.. కొందరిలో ఇంకా అనుమానాలు అలానే ఉన్నాయి. టీకా తీసుకోవాలా వద్దా? తీసుకుంటే ఏ వ్యాక్సిన్ మంచిది? దుష్ప్రభావాలు కలిగితే ఎలా? తదితర సందేహాలు వ్యక్తంచేస్తున్నారు. ఈ ప్రశ్నలకు సమాధానాల కోసం కొందరు తెలిసిన వైద్యులను, స్నేహితులను సంప్రదిస్తుంటే, మరికొందరు ఇంటర్నెట్లో శోధిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు వ్యాక్సిన్ గురించి వైద్య నిపుణులు ఏం చెప్తున్నారు? ఏ వ్యాక్సిన్ తీసుకుంటే మంచింది? కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలమధ్య తేడా ఏమిటి? తదితర సందేహాలను నివృత్తి చేసేందుకు ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం..
కొవాగ్జిన్ ప్రత్యేకత
మొదటి భారతీయ కొవిడ్ టీకా కొవాగ్జిన్. కొవిడ్-19ను ఎదుర్కోవడంలో దీనికి 81% సామర్థ్యం ఉన్నట్టు కొవాగ్జిన్ను తయారుచేసిన భారత్ బయోటెక్ ప్రకటించింది. కొవాగ్జిన్ను ఇనాక్టివేటెడ్ వైరస్ పద్ధతిలో అభివృద్ధిచేశారు. ఇందులో కొవిడ్ వైరస్ను ఇనాక్టివ్ (నిర్వీర్యం) చేసి తయారుచేసిన టీకాను శరీరంలోకి ఎక్కిస్తారు. ఈ ఇనాక్టివేటెడ్ వైరస్ శరీరంలో వృద్ధి చెందదు. వ్యాధిని కలిగించలేదు. టీకా ద్వారా వైరస్ ఒంట్లోకి ప్రవేశించగానే దాన్ని ఎదుర్కొనేందుకు రోగనిరోధక శక్తి ప్రతిరక్షకాలను విడుదల చేస్తుంది. ఇనాక్టివేటెడ్ వైరస్ ప్రతిరక్షకాలపై పోరాటం చేయదు కాబట్టి అవి రక్తంలో ఉండిపోతాయి. నిజమైన కొవిడ్ వైరస్ శరీరంలోకి ప్రవేశించగానే రక్తంలో ఉన్న ప్రతిరక్షకాలు వైరస్ను గుర్తించి చంపేస్తాయి.
టీకాలు ఏం చేస్తాయి?
శత్రువులు తమ ప్రదేశంలోకి రాగానే సైనికులు పోరాడి చంపుతారు. ఇలాంటి వ్యవస్థే మన శరీరంలోని రోగనిరోధక శక్తి. శరీరంలోకి ప్రమాదకర వైరస్ లేదా బ్యాక్టీరియా ప్రవేశించినప్పుడు రోగనిరోధక వ్యవస్థ అప్రమత్తమై ఆ వైరస్ను చంపేసే ప్రతి రక్షకాలను విడుదల చేస్తుంది. మన రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటే వైరస్ ఓడుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తి వ్యవస్థ తక్కువగా ఉంటే ప్రతిరక్షకాలపై వైరస్ పైచేయి సాధించి రోగాన్ని కలిగిస్తుంది. ఇలాంటి పరిస్థితి రాకుండా టీకాలు తోడ్పడుతాయి.
కొవిషీల్డ్ ప్రత్యేకత
ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా అభివృద్ధిచేసిన కొవిషీల్డ్ టీకాను మనదేశంలో సీరం ఇన్స్టిట్యూట్ ఉత్పత్తి చేస్తున్నది. వైరల్ వెక్టార్ ఆధారంగా ఈ టీకాను తయారుచేశారు. ఈ టీకా ద్వారా కొవిడ్ వైరస్ను శరీరంలో ప్రవేశపెట్టరు. దానికిబదులుగా సాధారణ జలుబును కలిగించే అడినో వైరస్ (బతికున్న వైరస్)లో సార్స్ కొవిడ్-2 వైరస్ జన్యుపదార్థాన్ని (ఎంఆర్ఎన్ఏ) జొప్పించి టీకాను అభివృద్ధిచేశారు. టీకా ద్వారా శరీరంలోకి వెళ్లిన వైరస్.. కొవిడ్-19 మాదిరిగా ైస్పెక్ ప్రొటీన్ను తయారు చేసుకొంటుంది. ఈ ైస్పెక్ ప్రొటీన్ను రోగనిరోధక వ్యవస్థ గుర్తించి ప్రతిరక్షకాలను విడుదలచేస్తుంది. ఇవి రక్తంలో అలాగే కొంతకాలం ఉండిపోతాయి. నిజమైన కరోనా వైరస్ శరీరంలోకి ప్రవేశించగానే ఈ ప్రతిరక్షకాలు దానిని చంపేస్తాయి.
ఏ వ్యాక్సిన్ అయినా తీసుకోవచ్చు
ఇప్పుడున్న రెండు వ్యాక్సిన్లు వైరస్ను అడ్డుకుంటాయి. వ్యాక్సిన్ తీసుకోకుంటేనే ఎక్కువ నష్టాలు ఉంటాయి. కొత్త స్ట్రెయిన్ రూపంలో కరోనా మళ్లీ విజృంభిస్తే ఎంతో నష్టం జరుగుతుంది. వ్యాక్సిన్ దుష్ట్ప్రభావాలపై సోషల్మీడియాలో అతిగా ప్రచారం అవుతున్నది. నిజానికి ఏ వ్యాక్సిన్ తీసుకున్నా మంచిదే. ఎక్కువమంది వ్యాక్సిన్ తీసుకొన్నప్పుడే హెర్డ్ ఇమ్యూనిటీ పెరిగి వైరస్వ్యాప్తి ఆగుతుంది.
కొవాగ్జిన్, కొవిషీల్డ్ను ఎవరు తీసుకోరాదు?
ఈ రెండు టీకాలను తయారుచేసిన సంస్థలు ఫ్యాక్ట్షీట్లో దాదాపు ఒకేరకమైన జాగ్రత్తలను సూచించాయి. వీటిని ఎవరు వాడకూడదన్న అంశాలను స్పష్టంగా తెలిపాయి. అలర్జీలు, జ్వరం, శరీరంలో రక్తస్రావం, బలహీన రోగనిరోధకత, రోగనిరోధకతను ప్రభావితం చేసే ఔషధాలు వాడుతున్నవారు, గర్భవతులు, పాలిచ్చే తల్లులు, ఇతర తీవ్ర వ్యాధులున్నవారు ఈ వ్యాక్సిన్లను తీసుకోకూడదు. ఇతర కొవిడ్ నిరోధక టీకాలు వేసుకొన్నవారు కూడా వీటిని వాడకూడదు.
రెండు డోసులు తప్పనిసరి
కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలు పని చేయాలంటే రెండు డోసులు తీసుకోవాలి. నాలుగువారాల వ్యవధిలో ప్రైమ్, బూస్టర్ డోసులు వేసుకోవాలి. మొదటి డోసు తీసుకొన్న 28వ రోజు రెండో డోసు తీసుకున్న తర్వాత 2 వారాలకు పూర్తిస్థాయిలో ప్రతిరక్షకాలు ఉత్పత్తి అవుతాయి. అప్పటివరకు కొవిడ్ నిబంధనలు పాటించాల్సిందే.
దేని సామర్థ్యం ఎంత?
రెండు వ్యాక్సిన్లలో ఏది తీసుకున్నప్పటికీ మంచి ఫలితం ఉంటుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాల సామర్థ్యంపై ఇప్పటికే అధ్యయనాలు జరిగాయి. కొవాగ్జిన్కు కరోనాను నిరోధించటంలో 81% సామర్థ్యం ఉన్నదని భారత్ బయోటెక్ ప్రకటించగా, కొవిషీల్డ్ తీసుకున్న 12 వారాల తర్వాత 81.3% సామర్థ్యం చూపినట్టు లాన్సెట్ తెలిపింది.
దుష్ప్రభావాలు సాధారణం…
టీకా తీసుకున్న తర్వాత స్వల్పంగా జ్వరం, జలుబు, తలనొప్పి వంటి సాధారణ దుష్ప్రభావాలు వస్తుంటాయి. ఇది ప్రతి వందమందిలో ఐదుగురిలో మాత్రమే ఉంటుంది. వీటికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు చెప్తున్నారు. తీవ్ర దుష్ప్రభావాలు కనిపించడం చాలా అరుదని స్పష్టం చేస్తున్నారు.