బీజింగ్: కరోనా కారణంగా విదేశీ ప్రయాణికులపై నిషేధం విధించిన చైనా.. తాజాగా ఓ ఆఫర్ ఇచ్చింది. ఇండియాతోపాటు వివిధ దేశాల్లో ఉన్న చైనా ఎంబసీలు ఈ ఆఫర్ను ప్రకటించాయి. చైనాకు చెందిన వ్యాక్సిన్లు తీసుకున్న వాళ్లకు తమ దేశ వీసాలు ఇస్తామన్నది ఆ ఆఫర్ సారాంశం. గతేడాది నవంబర్ నుంచి ఇండియా నుంచి వచ్చే ప్రయాణికులపై చైనా నిషేధం విధించింది. ఇప్పుడా దేశం చేసిన ప్రకటన చైనాలో చదువుకుంటున్న 23 వేల మంది భారతీయుల్లో నిరాశ నింపింది. ఎందుకంటే ప్రస్తుతం ఇండియాలో చైనాకు చెందిన ఏ వ్యాక్సిన్ కూడా అందుబాటులో లేదు. ఇతర దేశాల వ్యాక్సిన్లు వేసుకున్న వాళ్లను కూడా అనుమతించే అవకాశం ఉన్నా దానికి మరింత సమయం పడుతుందని చైనా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతానికైతే చైనీస్ వ్యాక్సిన్లు తీసుకున్న వారిపైనే ప్రయాణ ఆంక్షలను ఎత్తేస్తున్నట్లు తెలిపింది.