హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. జిల్లాల్లోనూ కొత్తగా కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం 34,482 నమూనాలను సేకరించి వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 216 మందికి పాజిటివ్గా తేలినట్టు శనివారం విడుదలచేసిన బులెటిన్లో వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది. అత్యధికంగా జీహెచ్ఎంసీలో 52 కేసులు నమోదవగా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 18, రంగారెడ్డిలో 19, కరీంనగర్లో 11, ఆదిలాబాద్లో 10 కేసులు వెలుగుచూశాయి. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ రాష్ర్టాల్లో కరోనా కేసులు పెరిగిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. సరిహద్దు జిల్లాల్లో ఇప్పటికే టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్ను పకడ్బందీగా నిర్వహిస్తున్నది. ఆదివారం ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఆయా జిల్లాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు హెచ్చరించారు. సమూహాలుగా ఉండకుండా, మాస్కులు ధరించడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం వంటివి పాటించాలని సూచించారు. పోలింగ్బూత్కు వెళ్లే ముందు, వచ్చిన తరువాత తప్పనిసరిగా శానిటైజ్ చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ మేరకు అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లుచేసినట్టు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా రెండోదశ వ్యాక్సినేషన్ ప్రక్రియలో శనివారం 22,087 మంది తొలిడోస్ తీసుకున్నారు. ఇందులో 60 ఏండ్లు పైబడిన వారు, 45 నుంచి 59 మధ్య వయస్కులు ఉన్నారు. అన్నివర్గాలవారు కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు తొలిడోస్ తీసుకున్నవారి సంఖ్య 5,07,558కి చేరుకున్నది. రెండు డోసులు తీసుకున్నవారి సంఖ్య 2,19,222 ఉన్నట్టు వైద్యారోగ్యశాఖ బులెటిన్లో పేర్కొన్నది.
వివరాలు శుక్రవారం మొత్తం
పాజిటివ్ కేసులు 216 3,00,933
డిశ్చార్జి అయినవారు 168 2,97,363
మరణాలు 2 1,652
చికిత్స పొందుతున్నవారు – 1,918