బీజింగ్ : అమెరికా అధ్యక్ష పగ్గాలను బైడెన్కు అప్పగించి పక్కకు తప్పుకున్న డొనాల్డ్ ట్రంప్ పత్రికల పతాక శీర్షికలకు దూరమైనా ఆయనకున్న క్రేజ్ మాత్రం చెక్కుచెదరలేదు. ట్రంప్ ఇమేజ్ను క్యాష్ చేసుకునేందుకు డ్రాగన్ వ్యాపారి ఓ వినూత్న ఆలోచనతో ముందుకొచ్చారు. బుద్ధుని రూపంలో ఉన్న ట్రంప్ విగ్రహాన్ని ఆకర్షణీయంగా మలిచి ఈ కామర్స్ సైట్లలో అమ్మకానికి పెట్టాడు. తెలుపు రంగులో ఉన్న ట్రంప్-బుద్ధ విగ్రహంలో ఆయన తల పంకించి చేతులను తొడలపై ఉంచి కళ్లు మూసుకుని ప్రశాంత చిత్తంతో ఉన్నట్టు కనిపించాడు. చైనా ఈ కామర్స్ సైట్ తబావోలో ఉంచిన 4.6మీటర్ల భారీ విగ్రహం ధర రూ 44707 కాగా, చిన్న సైజులో 1.6 మీటర్ల విగ్రహం రూ 11,168 పలికింది.
ట్రంప్ ప్రవచించిన మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ నినాదం స్ఫూర్తితో మేక్ యువర్ కంపెనీ గ్రేట్ ఎగైన్ అనే సందేశాన్ని ఇస్తూ తాను ఈ ఉత్పత్తిని రూపొందించానని ఫుజియన్ ప్రావియన్స్కు చెందిన సెల్లర్ చైనా అధికార వార్తాపత్రిక గ్లోబల్ టైమ్స్కు తెలిపారు. వినోదం కోసం ప్రజలు ట్రంప్ విగ్రహాన్ని కొనుగోలు చేస్తున్నారని తాను మొత్తం వంద విగ్రహాలు తయారుచేయగా ఇప్పటికే పలు విగ్రహాలు అమ్ముడుపోయాయని చెప్పారు. అహంకారంతో కూడిన ట్రంప్ శకం ముగిసినా ఆయనలా ఉండకూడదని తనకు తాను గుర్తుచేసుకునేందుకే తాను ఈ విగ్రహం సొంతం చేసుకున్నానని ఓ కొనుగోలుదారుడు పేర్కొనడం గమనార్హం. ట్రంప్ హయాంలో చైనా-అమెరికా సంబంధాలు దిగజారిన సంగతి తెలిసిందే.