హైదరాబాద్: మహా శివరాత్రి సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్, మంత్రి మల్లారెడ్డి కీసర గుట్టలోని రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం అర్చకులు ఎంపీ సంతోష్ కుమార్, మల్లారెడ్డి కుటుంబ సభ్యులకు ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు అందించగా, ఆలయ అధికారులు వారిని సన్మానించారు.
అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. మిత్రులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ తెల్లవారుజామున మంత్రివర్యులు మల్లారెడ్డితో కలిసి కీసర రామలింగేశ్వరుడిని దర్శించుకున్నానని, స్వామి వారికి అభిషేకం చేసుకునే అదృష్టం దక్కిందని చెప్పారు. రెండు దశాబ్దాలుగా టీఆర్ఎస్ పార్టీ వెంటే ఉన్న కార్యకర్తలకు, ఏడేండ్లుగా తెలంగాణ రాష్ట్ర రథసారథిగా ప్రభుత్వాన్ని నడిపిస్తున్న సీఎం కేసీఆర్కు ఈ రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే శక్తిని ప్రసాదించాలని దేవదేవుణ్ణి ప్రార్థించానని తెలిపారు. తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, తెలంగాణ రాష్ట్రం మరిన్ని అఖండ విజయాలు సాధించాలని స్వామి వారిని ప్రార్థించినట్లు వెల్లడించారు.
మహాశివరాత్రి సందర్భంగా భవానీ రామలింగేశ్వరుడి బ్రహ్మోత్సవాలు కనులపండువగా కొనసాగుతున్నాయి. బుధవారం రాత్రి ఆలయ ప్రాంగణంలో స్వామివారి కల్యాణం ఘనంగా నిర్వహించారు. మంత్రి మల్లారెడ్డి దంపతులు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా భక్తులతో ఆలయం కిక్కిరిసిపోయింది. కాగా, మహాశివరాత్రి నేపథ్యంలో ఆలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వంద సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు.