బీజింగ్ : మారుమూల హిమాలయన్ ప్రావిన్స్ అయిన టిబెట్పై చైనా ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కొత్త పంచవర్ష ప్రణాళికలో 30 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.2.1 లక్షల కోట్లు) కేటాయించింది. ఈ నిధులతో టిబెట్లో ఎక్స్ప్రెస్వేలను నిర్మించడం, భారత సరిహద్దుల వరకు ఏర్పాటు చేసిన రైల్వే లైన్లను అప్గ్రేడ్ చేయడం వంటి పనులు చేపట్టనున్నది.
చైనా 14 వ పంచవర్ష ప్రణాళిక ప్రకారం, రవాణా మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం 2021-2025 కాలానికి చైనా దాదాపు 190 బిలియన్ యువాన్లు (29.3 బిలియన్ డాలర్లు) ఖర్చు చేయాలని యోచిస్తున్నది.
కొత్త ఎక్స్ప్రెస్వేలను నిర్మించడం, ఉన్న రహదారులను అప్గ్రేడ్ చేయడం, గ్రామీణ ప్రాంతాల్లో రహదారి పరిస్థితులను మెరుగుపరచడం, ఇతర రంగాల అభివృద్ధికి ఈ నిధులను ఉపయోగించనున్నట్లు టిబెట్లోని ప్రాంతీయ రవాణా శాఖను ఉటంకిస్తూ జిన్హువా వార్తా సంస్థ నివేదించింది.
2025 నాటికి టిబెట్లోని హైవేల మొత్తం మైలేజ్ 120,000 కి.మీ మించి, ఎక్స్ప్రెస్వేలు 1,300 కి.మీ మించి ఉంటుందని చైనాకు చెందిన అధికారులు తెలిపారు. సౌకర్యవంతమైన, భాగస్వామ్యమైన, సురక్షితమైన, ఆకుపచ్చగా ఉండే సమగ్ర రవాణా వ్యవస్థ సాధారణంగా 2025 నాటికి రూపుదిద్దుకునేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.
టిబెట్ రవాణా అవస్థాపన 2016-2020 కాలంలో గణనీయమైన మెరుగుదల కనబరిచింది.
ఇక్కడ రహదారి నెట్వర్క్ గత ఏడాది చివరినాటికి మొత్తం 118,800 కిలోమీటర్ల దూరానికి చేరుకున్నది. ఈ ఏడాది జూలైకి ముందు అరుణాచల్ ప్రదేశ్లోని భారత సరిహద్దుకు సమీపంలో ఉన్న టిబెట్లో చైనా బుల్లెట్ రైళ్లను నడుపుతుందని చైనా సీనియర్ అధికారి ఒకరు ప్రకటించారు. అన్ని ప్రధాన భూభాగ ప్రాంతీయ స్థాయిలకు హైస్పీడ్ రైలు సేవలను ప్రారంభించింది.
చైనా తన మారుమూల ప్రాంతాలను ప్రధాన భూభాగంతో కలుపుతూ టిబెట్లో రైలు నెట్వర్క్ సేవలను అభివృద్ధి చేయనున్నది.
అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుకు దగ్గరగా టిబెట్లోని లాసా, నియించి నగరాలను కలిపే రైల్వే లైన్ కోసం గత ఏడాది డిసెంబర్లో ట్రాక్-లేయింగ్ పనులు పూర్తయ్యాయని చైనా అధికారిక వార్తా సంస్థ జిన్హువా తెలిపింది.