హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 9 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు రోజురోజుకు మద్దతు పెరుగుతున్నది. మంగళవారం తెలంగాణ రిటైర్డ్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్, తెలంగాణ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా), అనుబంధ సంస్థ రిసోర్స్ పర్సన్ల సంక్షేమ సంఘం ప్రతినిధులు హైదరాబాద్లో మంత్రి గంగుల కమలాకర్ను కలిసి మద్దతు లేఖను అందజేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులకు మద్దతునిస్తున్నామని వాణీదేవికి మొదటి ప్రాధాన్య ఓటువేసి గెలిపిస్తామని తెలంగాణ రిటైర్డ్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్, మెప్మా, దాని అనుబంధ సంస్థల్లోని రిసోర్స్పర్సన్ ప్రతినిధులు చెప్పారు. తమ కుటుంబసభ్యులతోపాటు ఒక్కొక్కరం పది ఓట్లు వేయించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ రిటైర్డ్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మోహన్ నారాయణ, ప్రధాన కార్యదర్శి నరసరాజు, ప్రతినిధులు జే రవీందర్, కే దశరథ్రావు, కే యాదగిరిగౌడ్, ఏ సత్యనారాయణ, మెప్మా ఆర్పీల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు రూప్సింగ్, రాష్ట్ర అధ్యక్షురాలు ఎం సునీత, వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ, ప్రధాన కార్యదర్శి కే పద్మ, కోశాధికారి కే శ్రీమతి, ఇతర ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
వివిధ సంఘాలు మద్దతు తెలిపిన సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎస్ వాణీదేవికి మొదటి ప్రాధాన్య ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.