హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇందిరేశంగుట్టలపై జరిపిన పురావస్తు అన్వేషణలో కొత్త రాతియుగపు ఆనవాళ్లు బయటపడ్డాయి. కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ అండ్ అమరావతి సీఈవో, పురావస్తు పరిశోధకుడు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి.. గుట్టలపై ప్రాచీక కట్టడ భాగాలు, శిల్పాలను పరిశీస్తుండగా ఆది మానవులు గొడ్డళ్లకు పదునుపెట్టిన చిన్న గాడి బయటపడింది. ఇది 8 అంగుళాల పొడువు, అంగుళం వెడల్పు, అంగుళంలోతు ఉన్నదని ఆయన తెలిపారు. నల్లశానపురాతిలో చేసుకున్న చిన్న గొడ్డళ్ల మొనలను రెండు వైపులా అరగదీయడానికి ఈ రాతి గాడిని వినియోగించేవారని చెప్పారు. రాతి గొడ్డళ్లను ఇలా అరగదీసి కొన మొనవేలిని సులువుగా నరకటానికి లేదా ఎముకలను విరగొట్టడానికి వినియోగించేవారని తెలిపారు. కొత్త రాతి యుగపు గొడ్డళ్ల ఆచూకీ కొసం ఇందిరేశం గుట్ట చుట్టూ పరిశీలిస్తుంటే మధ్యరాతి యుగపు రాతి బ్లేడ్లు దొరికాయని చెప్పారు.