హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని దాదాపు 6 లక్షల ఐటీ ఉద్యోగుల్లో 40 శాతం పైచిలుకు తెలంగాణ వాసులే ఉన్నారని, వీరంతా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ ఓట్లను నమోదు చేసుకున్న నేపథ్యంలో ఈనెల 14న జరిగే పోలింగ్లో టెక్కీలు క్రియాశీలంగా పాల్గొని ప్రజాస్వామ్య ప్రక్రియలో తమ భాగస్వామ్యాన్ని పెంచుకోవాలని టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మక్తాల పిలుపునిచ్చారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, పోలింగ్ నేపథ్యంలో టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మక్తాల మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య ప్రక్రియలో తమ భాగస్వామ్యాన్ని చాటుకునేలా టెక్కీలు పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఉన్నత విద్యావంతులు తమ అభిప్రాయాలను తెలియజేసే ఈ ఎన్నిక అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా ఐటీ రంగానికి చెందిన వివిధ అంశాలను సందీప్ మక్తాల ప్రస్తావించారు. రాష్ట్రంలోని బీటెక్ సహా ఇతర సాంకేతిక విద్యార్హత ఉత్తీర్ణులైన వారి ఆశలు ఐటీ రంగంపైనే ఉన్నాయన్నారు. ఐటీ రంగంలో ఒక్క ప్రత్యక్ష ఉద్యోగం ద్వారా 3 నుంచి 4 పరోక్ష ఉద్యోగాలు అనుబంధ రంగాలైన డ్రైవింగ్, సెక్యురిటీ, హౌస్ కీపింగ్, ఇతరత్రా రంగాల్లో కల్పించబడతాయన్నారు. కాబట్టి ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు ప్రజాప్రతినిధులు కృషి చేయాలన్నారు. తద్వారా జిల్లాల్లోని యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని వివరించారు.