న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్కు చెందిన జ్యోతిరాధిత్య సింథియా ఒకప్పుడు కాంగ్రెస్ నేత. ఇప్పుడు ఆయన బీజేపీలో చేరారు. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు గత ఏడాది ఎన్నికయ్యారు. కాంగ్రెస్ను వీడిన జ్యోతిరాధిత్య సింథియాను ఇవాళ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గుర్తు చేశారు. యూత్ వింగ్ కార్యకర్తలతో మాట్లాడుతూ.. ఒకవేళ జ్యోతిరాధిత్య సింథియా కాంగ్రెస్లో ఉండి ఉంటే, ఇప్పుడు ఆయన సీఎం అయ్యేవారని, కానీ బీజేపీలో చేరడం వల్ల బ్యాక్బెంచర్ అయినట్లు రాహుల్ కామెంట్ చేశారు. కాంగ్రెస్ వర్కర్లతో కలిసి పనిచేసి.. పార్టీని బలోపేతం చేసే అవకాశం సింథియాకు ఉండె అని రాహుల్ చెప్పారు. ఏదో ఒక రోజు మీరు సీఎం అవుతారని సింథియాకు చెప్పానని, కానీ ఆయన మరో మార్గాన్ని ఎంచుకున్నారని రాహుల్ తెలిపారు. మీరిది రాసుకోండి.. అక్కడ ఆయన ఎన్నటికీ సీఎం కాలేరు, ఆ పదవి కావాలంటే ఆయన ఇక్కడకు రావాల్సిందే అని కార్యకర్తలతో రాహుల్ అన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సిద్ధాంతాలతో పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉండాలని, భయపడవద్దు అని రాహుల్ యువ పార్టీ కార్యకర్తలకు హితువు పలికారు.