ఖమ్మం, మార్చి 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఏపీ పునర్విభజన చట్టంలో తెలంగాణకు ఇస్తామని పేర్కొన్న హామీలు ఏమయ్యాయని నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం 1,32,000 ఉద్యోగాలను భర్తీచేసిందని.. టీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలును జీర్ణించుకోలేకనే విపక్ష పార్టీలు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నాయని పల్లా ఆరోపించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లో చేపట్టిన ప్రచారంలో పల్లా పాల్గొన్నారు. మణుగూరులో నిర్వహించిన సమావేశంలో పల్లా మాట్లాడుతూ.. రాజకీయ లబ్ధి కోసమే ప్రతిపక్ష పార్టీలు ప్రజలు, పట్టభద్రులను గందరగోళానికి గురిచేస్తున్నాయని విమర్శించారు. అన్నివర్గాల ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉపాధ్యాయ, ఉద్యోగులతో పేగుబంధం ఉన్నదని చెప్పారు. పేద విద్యార్థులు, నిరుద్యోగుల కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తుందని వెల్లడించారు. నష్టాల పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలోని ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్పరం చేస్తుండగా.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నష్టాల్లో ఉన్న ఆర్టీసీని, సింగరేణిని లాభాల బాట పట్టించిందని స్పష్టంచేశారు. జిల్లా కేంద్రాల్లో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పన చేస్తామని పల్లా పేర్కొన్నారు. ఆరేండ్లలో అనేక సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించానని చెప్పారు. మణుగూరు ప్రాంతంలోని పోడు సమస్యను సీఎం కేసీఆర్ కచ్చితంగా పరిష్కరిస్తారని భరోసానిచ్చారు. అనంతరం మహబూబబాద్ ఎంపీ మాలోత్ కవిత మాట్లాడుతూ.. పాండురంగాపురం నుంచి భద్రాచలం వరకు రైల్వే లైన్ మంజూరు చేయాలని కేంద్రానికి ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని గుర్తుచేశారు. ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు మాట్లాడుతూ అన్ని వర్గాలకు నాణ్యమైన విద్యను అందజేసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం 119 నియోజవర్గాల్లో రెసిడెన్షియల్ స్కూల్, కాలేజీలను ప్రారంభించిందని చెప్పారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. అన్ని రంగాల్లో దూసుకెళ్తున్న తెలంగాణ అభివృద్ధికి అడ్డుకట్ట వేయాలని కొన్ని రాజకీయ పార్టీలు కుట్రలు చేస్తున్నాయని అన్నారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం చేతల ప్రభుత్వమని కొనియాడారు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తిచేశారు. ఆయా సమావేశాల్లో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బీ వెంకట్రావు, భద్రాచలం నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి తెల్లం వెంకటరావు, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి తాతా మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.