న్యూఢిల్లీ: ప్రతిరోజూ మీరు ఉదయాన్నే నిద్ర లేవగానే తాగే టీ.. టీ తయారీకి ఉపయోగించి పాలతోపాటు ఆ టీతోపాటు తినే బిస్కట్ల ధరలు పెరగనున్నాయి. వీటితోపాటు రోజువారీ నిత్యావసర వస్తువులు, సరుకుల ధరలు భగ్గుమని మండబోతున్నాయి. ఇన్పుట్ కాస్ట్ పెరిగిపోయిందనే పేరుతో ఎఫ్ఎంసీజీ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలు పెంచనున్నాయి.
ప్రత్యేకించి గత కొంత కాలంగా ప్రతిరోజూ పెరుగుతూ వచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు సెంచరీ కొట్టేశాయి.. ఈ ధరల ప్రభావం వివిధ వస్తువుల, సరుకుల రవాణాపై పడుతున్నది. ఆయా ఎఫ్ఎంసీజీ సంస్థలు సదరు వస్తువుల రవాణాకు భారీగా ఖర్చు చేయాల్సి వస్తున్నది. ప్రత్యేకించి ప్యాకేజింగ్ సామగ్రి ధరల రవాణా ఖర్చు తడిసిమోపెడవుతున్నది.
ఇక ఇంట్లో ప్రతి వంటలోనూ వినియోగించే వంట నూనెల ధరలు 75 నుంచి 80 శాతం పెరుగుతాయని పార్లె క్యాటగిరీ హెడ్ మయాంక్ షా హెచ్చరించారు. అధిక రవాణా ఖర్చులతోపాటు ప్యాకేజింగ్ వ్యయం కూడా పెరిగిపోతున్నది. కనుక పెరుగుతున్న ధరల భారం ప్రభావం తగ్గించడానికి తమ ముందు ఉన్న రకరకాల ఆప్షన్లను ఎఫ్ఎంసీజీ సంస్థలు పరిశీలిస్తున్నాయని మయాంక్ షా తెలిపారు.
అమూల్ ఇండియాకు చెందిన ఆర్ఎస్ సోధి మాట్లాడుతూ పెరిగిన లీటర్ పాల ప్యాకేజింగ్, రవాణా వ్యయం రూపాయి నుంచి రూ.1.25కి పెరిగిందన్నారు. లాక్డౌన్ ముగిసినప్పటి నుంచి పాల ధర 75 శాతం పెరిగిందని సోధీ చెప్పారు. పాలకు అధిక డిమాండ్ ఉన్నదని చెప్పారు. అయితే, సమీప భవిష్యత్లో పాలు, పాల ఉత్పత్తుల ధరలు పెరిగే అవకాశం లేదన్నారు.