కీసర, ఏప్రిల్ 20: తాళాలు, బీరువా పగలకుండా ఏకం గా బీరువాల్లోంచి సుమారు రూ.50 లక్షల విలువచేసే కిలో బంగారం మాయమైన ఘటన కీసర పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇంట్లో ఉన్న నలుగురు ఇల్లు విడిచి ఎక్కడికీ వెళ్లలేదు. 24 గంటల పాటు ఇంట్లో ఎవరో ఒకరుంటా రు. బీరువా తాళాలు ఇంట్లోనే ఉన్నాయి. బీరువాలోని బాక్సులూ ఉన్నాయి. కానీ, బాక్సుల్లోని బంగారం మాత్రం చోరీకి గురైంది. కీసర సీఐ జె.నరేందర్ గౌడ్ కథనం ప్రకా రం, దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని అహ్మద్గూడ గ్రామంలో పల్లె రాములు గౌడ్ అతని భార్య పల్లె సునీత, కుమారుడు మణికంఠ, కోడలు తేజస్వి ఒకే ఇంట్లో నివాసముంటారు. గత నెల మార్చి 30వ తేదీన పల్లె రాములు గౌడ్ భార్య సునీత ఓ ఫంక్షన్కు వెళ్లింది.
తిరిగి ఇంట్లోని బీరువాల్లోని బాక్సుల్లో సుమారు కిలో బంగారం దాచి పెట్టింది. ఇరవై రోజుల నుంచి ప్రతిరోజు బీరువా తీసి బంగారం బాక్సులను చూస్తుంది. సోమవారం సాయంత్రం బీరువా బాక్సుల్లో ఉన్న బంగారం కనిపించలేదు. 18 తులాల మ్యాం గో నక్లెస్, ఏడు తులాల చౌకర్, ఎనిమిది తులాల వైట్స్టోన్ లాంగ్ నక్లెస్, 3 తులాల గాజులు, 4 తులాల రింగులు, 2 తులాల చెవి కమ్మలు, 12 తులాల లాంగ్ నక్లెస్, మూడు తులాల నక్లెస్, నాలుగు తులాల చెవి రింగులు, 7తులాల లాంగ్ నక్లెస్, 10 తులాల షెల్ నక్లెస్, 6 తులాల బ్లాక్ బెడ్ చైన్, 3 తులాల మూడు జతల కమ్మలు, రెండు తులాల గ్లీన్ చైన్, మూడు తులాల తెల్లరాళ్ల నక్లెస్, ఐదు తులాల బ్రాస్లెట్, ఐదు తులాల చైన్లు అపహరణకు గురయ్యాయి.
బీరువా పగిలిపోకుండా, తాళాలు పక్కనే ఉన్నా బీరువా బాక్సుల్లో ఉన్న కిలో బంగారం మాయమైపోవడంతో ఈ కేసు చాలా విచిత్రంగా ఉందని కీసర సీఐ తెలిపారు. కేసుకు సంబంధించి సాంకేతికంగా, టెక్నికల్గా పూర్తి వివరాలు సేకరించి కేసును ఛేదిస్తామని సీఐ నరేందర్ గౌడ్ మీడియాకు వివరించారు.