మేడ్చల్ కలెక్టరేట్, ఏప్రిల్ 20: నాగారం మున్సిపాలిటీ పరిధిలోని రాంపల్లి గ్రామంలోని సామూహిక వైకుంఠధామానికి ప్రభుత్వం కోటి రూపాయిలు మంజూరు చేయడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతి మున్సిపాలిటీ పరిధిలో వైకుంఠధామాలను నిర్మిస్తుంది. గతంలో ఎవరైన చనిపోతే దహన సంస్కారాలు చేసిన చోట నీటి సదుపాయం, స్నానపు గదులు, మరుగు దొడ్లు లేక అంత్యక్రియలకు వచ్చిన వారు ఇబ్బందులు పడేవారు. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత ఆఖరి మజిలీ గౌరవప్రదంగా ఉండాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ వైకుంఠధామాలను ఆధునిక హంగులతో నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రాంపల్లి సామూహిక వైకుంఠధామంలో త్వరలో ఆధునిక హంగులతో పనులు మొదలు కానున్నాయి.