కీసర : సమష్టి కృషి, సాంకేతిక పరిజ్ఞానం తోడ్పాటు, పక్కా ప్రణాళిక, పటిష్ట బందోబస్తు అన్నింటికీ మించి ఫ్రెండ్లీ పోలీసింగ్ ప్రజలకు చేరువ కావడంతో నేరాల అదుపునకు శాంతిభద్రతల పరిరక్షణలో రాచకొండ కమిషనరేట్ పరిధిలోని కీసర పోలీస్స్టేషన్ అధికారులు సఫలీకృతులై ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతున్నారు. రాచకొండ పోలీసు ఉన్నాతాధికారుల ఆదేశాలు పాటిస్తూ గస్తీ పకడ్బందీ నిఘాలతో 2018 నుంచి 2020 వరకు చక్కటి ప్రగతి సాధించారు. నేరాలను అదుపు చేయడంతో పాటు చోరీ సొత్తును 80 శాతం రకవరీ చేశారు.
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. మండల పరిధిలోని పలు గ్రామాల్లో దాతల సహకారంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. దీంతో కీసర పోలీసులు చోరీలు, ఇతర కేసులను సీసీ పుటేజీల సహకారంతో ఛేదించి చక్కటి ఫలితాలను సాధిస్తున్నారు. కీసర మండలంలో చాలా ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు రాగింగ్తో పాటు పలు అంశాల మీద అవగాహన కూడా కల్పించి చక్కటి చైతన్యాన్ని నింపారు.
కీసర పోలీస్స్టేషన్ పరిధిలో 2018లో నాగారం చౌరస్తా దమ్మాయిగూడకు వెళ్లే మార్గంలోని మెయిన్రోడ్డులో పెద్ద బంగారం దుకాణంలో గుజరాత్కు చెందిన నేరస్తులు దొంగతనం చేశారు. ఈ కేసును సీసీ ఫుటేజ్ల ద్వారా పోలీసులు ఛేదించి బంగారం రికవరీ చేసి దుకాణ యజమానికి అప్పగించారు. 2018లో నెరడ్మెట్లో ఒక వ్యక్తిని చంపి కీసర సమీపంలో కారులో పెట్టి కాల్చివేశారు. ఈ కేసును కూడా పోలీసులు సీసీ కెమెరాల ద్వారా ఛేదించారు. 2019లో కరీంగూడలో ఓ మహిళ మెడలో నుంచి ద్విచక్ర వాహనం మీద వెళ్తూ బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. దీంతో పోలీసులు అతడిని నగరంలోని మెహిదీపట్నంలో పట్టుకొని ఆభరణాలను రికవరీ చేశారు. 2019లో ఆక్సిడెంట్ చేసి వెళ్లి పరారైన రెండు వాహనాలను పట్టుకున్నారు. 2019లో ఈసీఐఎల్ నుంచి రాంపల్లిలో ఆటోలో వస్తున్న వారి దగ్గర అయిదుగురు దొంగలు బంగారం, వెండి ఆభరణాలు దోచుకెళ్లారు. వారిని తిమ్మాయిపల్లిలోని సైలెంట్వార్డులో పట్టుకొని సొమ్మును రికవరీ చేశారు. 2020లో నాగారం నుంచి దమ్మాయిగూడకు వెళ్లే మార్గంలో బైక్ చోరీ జరిగింది. సీసీ ఫుటేజీల ద్వారా ఇద్దరు దొంగలను పట్టుకున్నారు. 2020లో రాంపల్లిలో ఈటాచీ వాహనాన్ని దొం గిలించారు. ఆ వాహనాన్ని, నేరస్తులను పోలీసులు పట్టుకున్నారు. 2020లో రాంపల్లి ఇండస్ట్రియల్ ఏరియాల్లో మిషన్లను డీసీఎంలో పెట్టుకొని ఎత్తుకెళ్లారు. పోలీసులు డీసీఎంను పట్టుకొని సొత్తును రికవరీ చేశారు. 2020లో అహ్మద్గూడలో డంపింగ్లారీని ఇద్దరు దొంగలు ఎత్తుకెళ్లారు. ఆ లారీని పట్టుకొని నేరస్తులను కోర్టులో హాజరుపర్చారు. 2020లో నాగారంలోని ఈశ్వరపురి కాలనీలో స్నేహితుడి దగ్గర రూ.30 లక్షల నగదును ఎత్తుకెళ్లిన ఒక వ్యక్తిని పట్టుకొని డబ్బును రికవరీ చేశారు.
పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సమష్టి కృషితో చక్కటి ఫలితాలను సాధిస్తున్నాం. పోలీసుల సేవలను, యాప్లను ప్రజలకు వివరించడంతో పాటు చోరీలు, మోసాలు, నేరాలపై అవగాహన కల్పిస్తున్నాం. కీసర మండలంలోని నాగారం, కీసర, రాంపల్లి గ్రామాలతో పాటు పలు గ్రామాల్లో అత్యధిక సంఖ్యలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడానికి దాతల సహకారంతో ఇప్పటికీ సుమారుగా రూ.25 లక్షల వరకు నగదును తీసుకున్నాం. రాచకొండ సీపీ మహేశ్ భగవత్ చేత త్వరలోనే ఆయా ఏరియాల్లో అధిక సంఖ్యలో సీసీ కెమెరాలను ఏర్పాటు ప్రారంభిస్తాం. -కీసర సీఐ జె.నరేందర్గౌడ్