వన్యప్రాణులను వేటాడటం వారికో సరదా.. చీకట్లో వేట వారికో ఆట..! కీకారణ్యంలో తుపాకుల మోత మోగించడం, చిట్టడవుల్లో మాటు వేసి మూగజీవాల మృత్యుఘోష వినడం వాళ్లకు హాబీ… హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వరకు జింకలు, నీల్గాయ్లు, దుప్పులు ఉన్న అటవీ ప్రాంతాల్లో వాలి రెచ్చిపోతారు.. గుంపులుగా వెళుతూ మాటు వేస్తారు.. గురిచూసి వేటాడటంలో పందెం కాస్తారు.. పందాల కోసం చెక్బుక్లను వెంట తీసుకెళ్తారు.. వేటాడిన వన్యప్రాణితో మరుసటి రోజు ఉదయం విందు చేసుకుంటారు.. ఎవరైనా పట్టుకుంటే బెదిరిస్తారు.. లేకుంటే ప్రలోభ పెడ్తారు. చిట్టడవులే అడ్డాలుగా చెలరేగుతున్న ఈ తరహా ముఠాలపై అటవీశాఖ ప్రధాన దృష్టి సారించింది. వారిపై పీడీ యాక్టు కింద కేసులు పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నది.
హైదరాబాద్ కేంద్రంగా వన్యప్రాణులపై గురిపెడుతున్న వేటగాళ్లపై ఫారెస్ట్ యాంటీ పోచింగ్ వింగ్ కన్నేసింది. మాసబ్ట్యాంక్, మెహదీపట్నం, గుడిమల్కాపూర్, లక్డీకాపూల్ తదితర ప్రాంతాల నుంచి వేటకు వెళ్తున్న వారి జాబితాను సిద్ధం చేస్తున్నది. వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972 కింద ఇప్పటికే పలువురిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపారు. అందులో కొందరు పద్ధతి మార్చుకోలేదని గుర్తించారు. వారిపై పీడీ యాక్ట్ పెట్టే యోచనలో ఉన్నట్టు అటవీశాఖ అధికారి ఒకరు తెలిపారు.
చార్మినార్, మార్చి 9 : కృష్ణ జింకలను వేటాడి.. మాంసం విక్రయిస్తున్న ముఠాను దక్షిణ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం జూపార్కు అధికారులు, సౌత్జోన్ టాస్క్ఫోర్స్ అదనపు కమిషనర్ చక్రవర్తి గుమ్మితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర సీపీ అంజనీకుమార్ వివరాలు వెల్లడించారు.. నిర్మల్ జిల్లా కుబీర్ మండలానికి చెందిన చవాన్ శంకర్బాబా (36) అటవీ ప్రాంతంలో వ్యవసాయం చేస్తుంటాడు. ఈ క్రమంలో అటవీ నుంచి వచ్చే జింకలతోపాటు ఇతర వన్యప్రాణులను అక్రమంగా బం ధించి.. వాటిని విక్రయిస్తున్నాడు..గతంలో కూడా ఇలాగే చేయడంతో 2018లో అతడిని అరెస్ట్ చేశారు.. ఇటీవల నిజామాబాద్ జిల్లాకు చెందిన జుబేర్తో పరిచయం ఏర్పడింది. ఇతడు ఇప్పటికే అటవీ నుంచి వచ్చే జింకలతోపాటు ఇతర వన్యప్రాణులను అక్రమంగా బం ధించి.. వాటిని విక్రయిస్తున్నాడు.. ఈ ఇద్దరు కలిసి జింకలను వేటాడి… జింక మాంసాన్ని విక్రయించాలనుకున్నారు..
ఇదే సమయంలో నగరంలోని ఆసిఫ్నగర్ ప్రాంతానికి చెందిన జుబేర్ స్నేహితుడు సల్మానుద్దీన్ అలియాస్ సల్మాన్ తనకు జింక మాంసం కావాలని కోరాగా.. ఈ విషయాన్ని జుబేర్.. స్నేహితుడు శంకర్బాబాకు చెప్పాడు.. అప్పటికే శంకర్ బాబా రెండు జింకలను వేటాడి దాచాడు. దీంతో జుబేర్, సల్మాన్ కారులో నిర్మల్కు వెళ్లి రూ.15 వేలకు బేరమాడి.. అడ్వాన్స్గా రూ.7వేలు చెల్లించి.. సజీవంగా ఉన్న కృష్ణ జింకలను తీసుకున్నారు. అక్కడే ఓ జింకను చంపి… ఆ మాంసాన్ని బోధన్ ప్రాంతానికి చెందిన మరో వ్యక్తి ఇమ్రాన్కు విక్రయించారు. అక్కడి నుంచి ముగ్గురు నగరంలోని ఆసిఫ్నగర్కు చేరుకుని మిగతా జింకల మాంసాన్ని విక్రయించాలనుకున్నారు.. దీనిపై సమాచారం అందుకున్న దక్షిణ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు అటవీశాఖ అధికారులతో కలిసి నిందితులు శంకర్బాబా, జుబేర్, సల్మాన్లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి జింక మాంసంతోపాటు సజీవంగా ఉన్న మరో జింక, కారును స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఇమ్రాన్ పరారీలో ఉన్నాడు. నిందితుల సమాచారాన్ని సేకరించిన టాస్క్ఫోర్స్ కానిస్టేబుల్ జియాకు నగర సీపీ రివార్డును అందించారు. సమావేశంలో జూ పార్క్ క్యూరేటర్ సుభద్రాదేవి , దక్షిణ మండల టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, ఎస్సైలు చంద్రమోహన్, శ్రీశైలం, మహ్మద్ తఖియుద్దీన్, నరేంద్ర, ఇతర సిబ్బంది పాల్గొన్నారు