మెదక్ : 2022 జనవరిలో ఓటరు తుది జాబితా ప్రకటించే నాటికి ఎలాంటి తప్పిదాలు లేకుండా సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్గోయల్ జిల్లా కలెక్టర్లకు సూచించారు. శనివారం హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఓటరు జాబితాలో ఎలాంటి లాజికల్ తప్పులు లేకుండా మార్పులు, చేర్పులు వంటివి చేపట్టి ఈ నెల 30వ తేదీలోగా పరిష్కరించాలని సూచించారు. నవంబర్ నాటికి డ్రాప్ అవుట్ పబ్లికేషన్ జారీ చేసేముందే చనిపోయిన, డూప్లికేట్ ఓటర్ల పేర్లు తొలగించాలన్నారు. పోలింగ్ కేంద్రాలను రేషనైలేజేషన్ చేస్తూ ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటుకు గుర్తించాలన్నారు. స్విప్ కార్యక్రమాల్లో భాగంగా గ్రామ స్థాయి వరకు ఓటరు నమోదుపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్లకు సూచించారు.
ఓటరు జాబితాల్లో తప్పొప్పుల సవరణ, మార్పులు, చేర్పులకు సంబంధించి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని, ఎటువంటి దరఖాస్తులు పెండింగ్లో లేవని కలెక్టర్ హరీశ్ తెలిపారు. రేషనైలేజేషన్లో భాగంగా జిల్లాలోని రెండు శాసనసభ నియోజకవర్గాల పరిధిలో కొత్తగా పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత లేదని తెలిపారు. ఓటరు ఈ ఎపిక్ కార్డులకు సంబంధించి 1,636 మంది దరఖాస్తు చేసుకోగా 949 మంది కార్డులను డౌన్లోడ్ చేసుకున్నారని, మిగతా ఓటర్లు కార్డులను డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా సమాచారం ఇస్తున్నామని ఆయన తెలిపారు. అదే విధంగా ఎపిక్ కార్డు పోయిన, పాడైపోయిన వాటికి సంబంధించి 387 దరఖాస్తులు రాగా 33 పెండింగ్లో ఉన్నాయని, వాటిని కూడా త్వరలోనే పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు. ఈవీఎం, వీవీ ప్యాట్లను భద్రపర్చుటకు ఏర్పాటు చేసిన గోదాములో అదనంగా ఒక హాలు నిర్మించేందుకు రూ.53 లక్షలతో పంపిన ప్రతిపాదనలకు నిధులు మంజూరు చేయాల్సిందిగా కలెక్టర్ కోరారు.
విద్యార్థులు ఓటరుగా పేరు నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలి..
17, 18 ఏండ్ల వయసు కలిగి ఉన్నత పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఏ ఒక్కరూ మిగిలిపోకుండా ఓటరుగా పేరు నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని కలెక్టర్ హరీశ్ అధికారులకు సూచించారు. అందుకనుగుణంగా పాఠశాలలు, కళాశాలల్లో ఎలక్టోరల్ లిటరసీ క్లబ్ కార్యకలాపాలు చురుకుగా కొనసాగించాలని సూచించారు. ప్రతి ఓటరు ఓటు హక్కు విలువను, ఎన్నికల ప్రవర్తనానియమావళిని తెలుసుకొని నైతిక బాధ్యతగా ఓటు వేసేలా అవగాహన కలిగించాలని స్విప్ నోడల్ అధికారి రాజిరెడ్డికి సూచించారు. ఇందుకు సంబంధించి భారత ఎన్నికల సంఘం చక్కగా తెలుగులో ఓటేద్దాం రండి పేరున చిన్న పుస్తకం ముద్రించిందని, దానిని
అన్ని లిటరసీ క్లబ్లకు అందించాలన్నారు. నిర్భయంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు వేసేలా …ఎన్నికల సంఘం రూపొందించిన మొబైల్ గరుడ యాప్పై త్వరలో బూత్ స్థాయి అధికారులకు శిక్షణ ఇస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా గోడపత్రిక పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ రమేశ్, ఆర్డీవో సాయిరాం, స్విప్ నోడల్ అధికారి రాజిరెడ్డి పాల్గొన్నారు.