మెదక్ : దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా జిల్లాలో ఈ నెల 15 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు స్వచ్ఛతా హీ సేవ పేరున వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హరీశ్ అన్నారు. ఈ సందర్భంగా శనివారం ఆయన తన చాంబర్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, డీఆర్డీవో శ్రీనివాస్, డీపీవో తరుణ్కుమార్, స్వచ్ఛభారత్ మిషన్ సమన్వయ అధికారి సంతోష్తో కలిసి గోడ పత్రికను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమాల్లో భాగంగా స్వచ్ఛత, శ్రమదానం రౌండ్ ఒకటిలో అన్ని మండల, గ్రామ స్థాయిలో స్వచ్ఛత జాగృతి యాత్ర ఏర్పాటు చేస్తూ ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్త సేకరణ వంటి పనులు చేపట్టడం జరుగుతుందని అన్నారు. ఇక స్వచ్ఛత, శ్రమదానం రెండవ రౌండ్లో భాగంగా ఒక సారి ఉపయోగించి పడేసిన ప్లాస్టిక్ నిషేధంపై గ్రామ పంచాయతీల్లో తీర్మానం చేస్తారని, స్వచ్ఛభారతి సేవా వేడుకలు నిర్వహిస్తామని అన్నారు. మండల, గ్రామ స్థాయిల్లో కార్యక్రమాలను నిర్వహించేందుకు మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల పరిషత్ అధికారులకు తగు ఆదేశాలిచ్చామని కలెక్టర్ హరీశ్ తెలిపారు.