మెదక్ మున్సిపాలిటీ: టీచర్ల బదిలీలు, పదోన్నతులు కొత్త జిల్లాల ప్రకారమే జరుగుతాయని ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి అన్నారు. మెదక్ జిల్లా పీఆర్టీయూ సర్వసభ్య సమావేశం శుక్రవారం జిల్లా కేంద్రంలోని సాయిబాలాజీ గార్డెన్లో జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రఘోత్తంరెడ్డి హాజరై మాట్లాడుతూ త్వరలో బదిలీలు,
పదోన్నతుల విధివిధానాలు ఖరారు చేసి షెడ్యూలును ప్రభుత్వం విడుదల చేస్తుందన్నారు.
రాష్ట్రంలో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కేవలం పీఆర్టీయూతోనే సాధ్యమవుతుందన్నారు. అక్టోబర్ 9, 10 తేదీల్లో జరుగనున్న పీఆర్టీయూ స్వర్ణోత్సవాల సభకు సీఎం కేసీఆర్ ముఖ్యఅతిథిగా హాజరు కాబోతున్నారని… ఆ సభలోనే ముఖ్యమైన జీవోలు విడుదల చేస్తారని పేర్కొన్నారు. అంతకు ముందు పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కమలాకర్రావు మాట్లాడుతూ రేషనలైజేషన్పై సవరించిన ఉత్తర్వులు త్వరలోనే వెలువడుతాయన్నారు. డీఎస్సీ 2003 ఉపాధ్యాయుల సమస్యలు సైతం త్వరలోనే పరిష్కారమవుతుందన్నారు. సమావేశంలో దయానంద్రెడ్డి, వెంకట్రాంరెడ్డి, పోమ్లానాయక్, చంద్రశేఖర్, మహేశ్, మల్లారెడ్డి, సుభాశ్రెడ్డి, శ్రీనివాస్, వినోద్, ఆజయ్ పాల్గొన్నారు.
పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడిగా శ్రీనివాస్
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి ఆధ్వర్యంలో పీఆర్టీయూ జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా సబ్బని శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా సుంకరి కృష్ణలను ఎన్నుకున్నారు. త్వరలోనే పూర్తి స్థాయి జిల్లా కమిటీని ఎన్నుకోనున్నట్లు నూతన అధ్యక్షుడు శ్రీనివాస్ తెలిపారు.