మెదక్ : రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్ధేశంతోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ హరీశ్తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎఫ్సీఐ ధాన్యాన్ని కొనుగోలు చేయకపోయినా సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతిగా ముందుకు వచ్చి ధాన్యం కొనుగోలుకు ఆదేశాలు జారీ చేయడం అభినందనీయమని అన్నారు. రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.
రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకువచ్చే ముందు ధాన్యాన్ని తాళ్లు లేకుండా 17 శాతం తేమ శాతం మించకుండా తీసుకురావాలని సూచించారు. జిల్లా కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ.. గురువారం నుంచి జిల్లాలో 311 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేశామని, అందుకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాలలో ఎలక్ట్రానిక్ తూకం యంత్రాలు, ప్యాడీ క్లీనర్లు అందుబాటులో ఉంచాల్సిందిగా అధికారులకు ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు క లెక్టర్లు ప్రతిమసింగ్, రమేశ్, అడిషనల్ ఎస్పీ కృష్ణమూర్తి, డీఆర్డీవో శ్రీనివాస్, డీఎస్వో శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పరుశురాంనాయక్, జిల్లా రవాణాధికారి శ్రీనివాస్ గౌడ్, మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు రియాజ్, డీసీవో కరుణ, లీగల్ మెట్రాలజీ తదితరులు పాల్గొన్నారు.