నారాయణరావుపేట, ఏప్రిల్ 27 :కొనుగోలు కేంద్రంలో అక్రమాలకు పాల్పడిన ఘటనలో ఇద్దరు సస్పెన్షన్ కాగా సీసీకి షోకాజ్ నోటీసు జారీ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం డీపీఎం కరుణాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఈ నెల 23వ తేదీన రైతుల నుంచి సేకరించిన మూడు లారీల తూకం వేసిన ధాన్యం నుంచి 30 బస్తాల ధాన్యం అక్రమంగా ట్రక్షీట్లో నమోదు చేశారని తెలిపారు. అనంతరం ఆ ధాన్యాన్ని కేంద్రానికి కేటాయించిన మిల్లుకు పంపించడంతో ధాన్యంలో నాణ్యతాలోపం ఉందని మిల్లు యజమానులు కేంద్రం నిర్వాహకులకు సమాచారం అందించారన్నారు. కొనుగోలు కేంద్రం నిర్వాహకులు రైతులను మిల్లు వద్దకు వెళ్లి సమస్యను పరిష్కారం చేసుకోవాలని సూచించారన్నారు.
దీంతో మిల్లు వద్ద లారీ ట్రక్ షీట్ను పరిశీలించిన రైతులు నిర్వాహకుల పేర్లు ట్రక్ షీట్లో ఉండడాన్ని గమనించారని తెలిపారు. మిల్లుకు పంపిన ట్రక్ షీట్లలో ఒక దాంట్లో 10 బస్తాలు నమోదు చేసిన విషయాన్ని వెల్లడించలేదన్నారు. దీంతో రైతులు నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేయగా, విషయం తెలుసుకున్న అధికారులు, గ్రామ ప్రజాప్రతినిధులు రైతుల సమక్షంలో కొనుగోలు కమిటీ సభ్యులను ప్రశ్నించగా.. తాము తప్పుగా నమోదు చేసినట్లు ఒప్పుకున్నట్లు తెలిపారు. దీంతో వెలుగు గ్రామైక్య సంఘం 5, గ్రామైక్య సంఘం 3 లకు చెందిన వీఏవోలు దీపిక, లావణ్యను సంఘం సభ్యులు తాత్కాలికంగా తొలిగిస్తూ తీర్మానం చేశారని, నిర్లక్ష్యం వహించిన కారణంగా సీసీ హేమలతకు షోకాజ్ నోటీస్ జారీ చేసినట్లు తెలిపారు. అనంతరం గ్రామంలోని అర్హత కలిగిన యువకులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేసి ధాన్యం కొనుగోలు ప్రక్రియ నిర్వహిస్తున్నారు.