సిద్దిపేట అర్బన్, జూన్ 24 : వరి సాగు భారీగా పెరగడంతో రైతులు నాట్లు వేసే సమయంలో కూలీల కొరత, అధిక పెట్టుబడులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో వరిలో మూస పద్ధ్దతికి స్వస్తి చెబుతూ కొత్త పద్ధ్దతిలో వరి సాగుచేస్తున్న రైతుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. వాతావరణ మార్పులు, కూలీల కొరత, అధిక పెట్టబడి కారణంగా అన్నదాతలు క్రమంగా వరిలో వెద సాగు పద్ధ్దతిని అవలంభిస్తున్నారు. వరిలో వెద పద్ధతితో చాలా లాభాలు ఉన్నాయి. పెట్టుబడి తక్కువ, కూలీల కొరత, సాగుకాలం తక్కువగా ఉండడంతో పాటు పనులు కూడా తక్కువగా ఉండడంతో రైతులు ఎక్కువగా అనుసరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో రైతులకు వెద సాగుపై అవగాహన కల్పిస్తున్నది. సంప్రదాయ పద్ధ్దతి కంటే వెద పద్ధ్దతి ద్వారా అనేక లాభాలు ఉన్నాయని వ్యవసాయ అధికారులు రైతులకు సూచిస్తున్నారు.
వెద పద్ధ్దతితో లాభాలు..
వరిలో వెదజల్లే విధానం ద్వారా పంట ఏపుగా పెరగడంతో పాటు దిగుబడి ఎక్కువగా వస్తుంది. కూలీల ఖర్చు చాలా వరకు తగ్గుతుంది. నారుపోసే అవసరం ఉండదు. కాబట్టి సాగు సులువుగా జరుగుతుంది. ఒకవ్యక్తి రోజుకి మూడు నుంచి నాలుగు ఎకరాల వరకు విత్తనం వేసుకోవచ్చు. సంప్రదాయ పద్ధ్దతిలో ఎకరాకు 25 నుంచి 35కిలోల విత్తనాలు వాడితే, ఈ విధానంలో ఎకరానికి 10 నుంచి 12కిలోలు సరిపోతాయి. ఈ విధానంలో తెగుళ్ల సమస్య అధికంగా ఉండదు. నీటి వినియోగం కూడా తక్కువగా ఉండడంతో పాటు సంప్రదాయ పద్ధ్దతిలో కంటే పంట కాలం పది రోజులు తక్కువగా ఉంటుంది. వెద పద్ధ్దతి ద్వారా సుమారు ఎకరాకు రూ.10 వేల నుంచి రూ.12 వేల పెట్టుబడి ఖర్చు తగ్గుతుందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. పంట దిగుబడి సంప్రదాయ పద్ధ్దతిలో కంటే 2 నుంచి 3 క్వింటాళ్లు అధికంగా ఉంటుంది.
అవగాహనతో సత్ఫలితాలు..
సంప్రదాయ పద్ధ్దతిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకొని సీఎం కేసీఆర్ నుంచి కిందిస్థాయి అధికారుల వరకు వరి వెద పద్ధ్దతిలో సాగు చేసేందుకు విస్తృత అవగాహన కల్పిస్తున్నారు. వ్యవసాయ అధికారులు నిత్యం రోజుకో గ్రామంలో రైతులకు అవగాహన కల్పిస్తూ సాగుకు ప్రోత్సహిస్తున్నారు. వానకాలంలో ప్రతి గ్రామంలో 250 ఎకరాలు వెద పద్ధ్దతిలో సాగుచేసేలా రైతులను సిద్ధం చేయాలని వ్యవసాయ అధికారులను మంత్రి హరీశ్ ఆదేశించారు. ప్రతి గ్రామంలో అవగాహన సదస్సు నిర్వహించి రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని ఆదేశించారు. రైతులు కూడా వెద పద్ధ్దతిలో సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే పలు గ్రామాల్లో రైతులు ఈ విధానంలో సాగుకు శ్రీకారం చుట్టారు.
వెద జల్లు పద్ధతి ఇలా…
వెద పద్ధ్దతి విధానాన్ని అనుసరిస్తూ చాలామంది రైతులు లాభాలు పొందుతున్నారు. ఈ విధానంలో ముందు నేలను నీటితో తడిపి, ట్రాక్టర్ సహాయంతో దున్నుకోవాలి. ఆ తర్వాత గొర్రుతో చదును చేసుకోవాలి. పొలంలో నాలుగు మూలలు సమానంగా చేసుకోవాలి. ఎకరాకు 20 కేజీల చొప్పున విత్తనాలను నీటిలో నానబెట్టి, మూతులు పగిలిన తర్వాత పొలంలో చల్లుకోవాలి. పొలం మధ్యలో కాలువలు తీస్తే నీరు నిల్వ ఉండకపోవడంతో పాటు తెగుళ్ల సమస్య ఉండదు. మూడు రోజుల తర్వాత నీరు పెడుతూ, తీస్తూ నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా రెండుసార్లు చేసిన అనంతరం కలుపు మందును ఇసుకలో కలిపి చల్లుకోవాలి. 25రోజుల తర్వాత మరోసారి కలుపు మందు చల్లుకోవాలి. దీంతో కలుపు మొలకెత్తే సమస్య ఉండదు. కలుపు యాజమాన్యంపై రైతులు అవగాహన పెంచుకుంటే కలుపు కోసం కూలీల అవసరం రాదు. నాలుగు నెలల్లో పంట కాలం పూర్తయ్యే వరకు విడతల వారీగా అధికారుల సూచనల మేరకు యూరియా, పొటాష్ చల్లుకోవాలి.