సిద్దిపేట రూరల్, అక్టోబర్ 5: భారత్ రాష్ట్ర సమితి ప్రకటనతో సీఎం కేసీఆర్ స్వగ్రామం చింతమడకలో బుధవారం సంబురాలు చేసుకున్నారు. ఉదయం నుంచి సీఎం కేసీఆర్ ప్రకటన కోసం ఎదురు చూశారు. గ్రామంలో ఎక్కడ చూసినా కేసీఆర్ ప్రకటించే బీఆర్ఎస్ గురించే చర్చించుకున్నారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నారని, బీఆర్ఎస్ ఏర్పాటు చేస్తున్నారని, పార్టీని ప్రగతి భవన్ నుంచి ప్రకటిస్తారనే విషయాన్ని తెలుసుకున్న గ్రామస్తులు ఆసక్తిగా టీవీలు చూశారు. సీఎం కేసీఆర్ ప్రగతి భవనలో పార్టీ ఏర్పాటు విషయాన్ని ప్రకటించగానే, స్థానిక నాయకులు గ్రామంలోని పంచాయతీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. బీఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి) ఏర్పాటుపై స్థానికులు, నాయకులు, గ్రామస్తులు పెద్దఎత్తున గ్రామంలో సంబురాలు చేసుకున్నారు. చింతమడక సర్పంచ్ హంసకేతన్రెడ్డి, స్థానికుల నాయకుల ఆధ్వర్యంలో పంచాయతీ ఎదుట పటాకులు కాల్చారు. నృత్యాలు చేస్తూ ‘కేసీఆర్ జిందాబాద్.. బీఆర్ఎస్ జిందాబాద్.. సీఎం కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి’.. అంటూ నినదించారు. కాబోయే ప్రధాని కేసీఆర్ అని పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మెతుకు రవి, అమర్, తిరుపతి, చెప్యాల మహేశ్, శేఖర్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.