పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడం, ప్రజలకు ఆహ్లాదాన్ని కల్పించడమే లక్ష్యంగా ప్రతి మండల కేంద్రంలో బృహత్ ప్రకృతి వనాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది. నాలుగో విడుత హరితహారంలో వీటి ఏర్పాటుకు ప్రాధాన్యతిచ్చారు. ప్రతి మండల కేంద్రంలో 10ఎకరాల విస్తీర్ణంలో దీనిని అద్భుతంగా తీర్చిదిద్దనున్నారు. మండల కేంద్రంలో స్థలం లేనిచోట అదే మండలంలో ఏదేని గ్రామంలో దీనిని ఏర్పాటు చేస్తారు. అన్నిచోట్ల స్థలాల ఎంపిక ప్రక్రియ కొనసాగుతున్నది.
సిద్దిపేట (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ మెదక్, జూలై 20 : సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లోని అన్ని మండల కేంద్రాల్లో బృహత్ ప్రకృతి వనాల ఏర్పాటులో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. స్థల ఎంపిక ప్రక్రియ చురుగ్గా జరుగుతున్నది. ప్రతి మండల కేంద్రంలో 10ఎకరాల విస్తీర్ణంలో దీనిని ఏర్పాటు చేస్తారు. మండల కేంద్రంలో అనువైన స్థలం లేకపోతే అదే మండలంలోని ఏదైనా గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. స్థలాన్ని ఎంపిక చేసిన తర్వాత పిచ్చి మొక్కలు, చెత్తాచెదారం తొలిగించి భూమిని చదును చేస్తారు. చిట్టడివిని పెంచేందుకు స్థలాన్ని సిద్ధం చేస్తారు. బాహ్య వలయంలో 3 వరుసల్లో పొడవైన మొక్కలు కనీసం 1.5 మీటర్ల నుంచి 2 మీటర్ల పొడవు తగ్గకుండా మొక్కకు మొక్కకు మధ్య మూడు మీటర్ల దూరంలో నీడనిచ్చే, పండ్ల మొక్కలను నాటుతారు. మండల కేంద్రాల్లో గుర్తించిన స్థలాన్ని నాలుగు సమానమైన భాగాలుగా విభజించి మధ్యలో 0.75 ఎకరా విస్తీర్ణంలో పిల్లల ఆటస్థలం కోసం కేటాయిస్తారు. 10 ఫీట్లు పాదాచారుల దారి, నీటి సదుపాయానికి, అంతర్భాగంలో 8 ఫీట్ల దారిని కేటాయిస్తారు. 0.75 ఎకరా విస్తీర్ణంలో పిల్లల ఆటస్థలం కోసం నిర్దేశించారు. పిల్లలకు కేటాయించిన స్థలంలో కూర్చోవడానికి అవసరమైన బల్లలను ఏర్పాటు చేస్తారు.
ప్రతి భాగంలో 20జాతుల మొక్కలు …
ప్రతి భాగంలో ఇరవై జాతుల మొక్కలకు తక్కువ కాకుండా నాటుతారు. ప్రధానంగా అవి ఉసిరి, నేరేడు, టేకు, వెలగ, వేప, ఇప్ప, చందనం, రేగు, కుంకుడు, పనస, చీమ, చింత, అందుగా, నెమలినార, చింత, మొదలగు జాతి మొక్కలను నాటుతారు. ఈత, హెన్నా, సీతాఫలం, జామ, దానిమ్మ, కరివేపాకు, నిమ్మ, తాటి, వెదురు, జమ్మి, వావిలి మొదలగు పొదల జాతుల మొక్కలతో పాటు తంగేడు, అడ్డసారం, పారిజాతం, తిప్పతీగ, పోడపత్రి మొదలగు ఔషధ మొక్కలు, బాహ్య వలయంలో జీవ కంచె కోసం వెదురు, గచ్చకాయ, గోరింట, తదితర మొక్కలను నాటుతారు. యాదాద్రి అటవీ నమునా ప్రకారం బృహత్ పల్లె ప్రకృతి వనం పెంచడానికి గుంతలు తవ్వడం, మొక్కలు నాటడం, కాపలాదారుడు, నీటివసతి, మొక్కల నిర్వహణ తదితర పనులను జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో చేపడతారు.
నాటే మొక్కలు…
సహజ సిద్ధ్దమైన దట్టమైన అడవిని ఏర్పాటు చేయడానికి నాలుగు భాగాల్లో సంవత్సరం పొడవునా పచ్చగా ఉండే అటవీ జాతి మొక్కలను దగ్గరగా మొక్క మొక్కకు మధ్య ఒక మీటరు దూరంలో నాటుతారు. ప్రధానంగా చింత మొక్కలను ఎక్కువ సంఖ్యలో నాటుతారు. గ్రామ నర్సరీ నుంచి ఈ మొక్కలను సేకరిస్తారు.గ్రామీణ సామూహిక చెత్త సేకరణ స్థలం నందు సేకరించిన సేంద్రియ ఎరువును దున్నే సమయంలో కలుపుతారు. తద్వారా భూమి సహజ గుణం మెరుగుపడుతుంది. వ్యవసాయ ఆధారిత వ్యర్థపదార్థాలు వరి, గడ్డి, వేపాకు, కానుగ, గ్లిరిసిడియా మొదలగునవి భూమిపై పరుస్తారు. తద్వారా భూమిలోని తేమను పెంపొందించి, భూమి కోతను నివారించి కలుపు మొక్కలను నివారిస్తుంది.ప్రతి 1.71 ఎకరాల భాగంలో 6,925 దట్టమైన మొక్కలను, 1.56 ఎకరాల విస్తీర్ణంలో 3,300 మొక్కలను ప్రతి వరుసలో మొక్కకు మొక్కకు మధ్య మూడు మీటర్ల దూరంలో నాటుతారు. పది ఎకరాల విస్తీర్ణంలో బృహత్ పల్లె ప్రకృతి వనంలా నాటుతారు.
బృహత్ ప్రకృతి వనం కోసం 10 ఎకరాల స్థలం..
ఒక్కో పార్కుకు రూ.42 లక్షలు…
ఒక్కో బృహత్ ప్రకృతి వనాన్ని రూ.42 లక్షలతో ఏర్పాటు చేయనున్నారు. ఇందులో సామగ్రి, మొక్కల కోసం రూ.28.39 లక్షలు, కూలీల కోసం రూ.14.88 లక్షలు వినియోగించనున్నారు.
కోతుల సమస్యకు పరిష్కారం…
బృహత్ ప్రకృతి వనాల ద్వారా కోతులకు ఆహారం లభించనున్నది. ప్రస్తుతం కోతలకు ఆహారం దొరక్క అడవులను వదిలి గ్రామాల్లోకి వస్తున్నాయి. ఇళ్లల్లోని సామగ్రిని తీసుకెళ్తున్నాయి. బృహత్ ప్రకృతి వనాల ద్వారా వీటికి ఆహారం అందుబాటులోకి రానున్నది.
అన్ని మండలాల్లో ఏర్పాటు…
మెదక్ జిల్లాలో 21 మండలాల్లో బృహత్ ప్రకృతి వనాలను ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే 21 మండలాల్లో స్థల సేకరణ పూర్తయ్యింది. ఐదారు మండలాల్లో పనులు ప్రారంభమయ్యాయి. పది ఎకరాల విస్తీర్ణంలో అద్భుతంగా బృహత్ ప్రకృతి వనాలను ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో 31వేల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు తయారు చేశాం. ఒక్కో బృహత్ వనానికి రూ.42 లక్షల నిధులు ఖర్చు చేయనున్నాం.