సిద్దిపేట, జూలై 12 :నిరుపేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోనూ వైద్యరంగాన్ని బలోపేతం చేసేందుకు అనేక చర్యలు చేపట్టింది. రోగనిర్ధ్దారణ పరీక్షలకే లక్షల రూపాయలు ఖర్చవుతూ పేద వారికి పెనుభారంగా మారుతున్న వైద్య పరీక్షలను ఉచితంగా అందించేందుకు సీఎం కేసీఆర్ జిల్లా కేంద్రాల్లో తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్లను ఏర్పాటు చేశారు. 2021 ఫిబ్రవరి 2న మంత్రి హరీశ్రావు సిద్దిపేట జిల్లా కేంద్రంలో డయాగ్నోస్టిక్ హబ్ను ప్రారంభించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన డయాగ్నోస్టిక్ హబ్లో 62 రకాల పరీక్షలను చేయడంతో పాటు కరోనా కష్టకాలంలోనూ ఆర్టీపీసీఆర్ పరీక్షలను నిర్వహించారు. అధునాతనంగా పేదలకు ఉచితంగా డీడైమర్ పరీక్షలను అందుబాటులోకి తీసుకొచ్చారు. జూన్ నెల చివరి వరకు 28వేల 23శాంపిల్స్ను సేకరించి దాదాపుగా 64,475 టెస్టులు, 2,23,323 ప్యారామీటర్లలో పరీక్షలను నిర్వహించారు.
వీటితో పాటు 13,990 మందికి ఆర్టీపీసీఆర్ టెస్టులను చేశారు. 45 మందికి డీడైమర్ పరీక్షలను నిర్వహించినట్లు డయాగ్నోస్టిక్ హబ్ ఇన్చార్జి డా.కాశీనాథ్ తెలిపారు. ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు నెలల వారీగా శాంపిల్స్ సేకరణ చూస్తే డ్రైరన్ సమయంలో 2,715 శాంపిల్స్ సేకరించగా 5,317 టెస్టులు చేశారు. ఫిబ్రవరి మాసంలో 5,214 శాంపిల్స్ను సేకరించి 22,004 టెస్టులను చేశారు. మార్చిలో 7,562 శాంపిల్స్ సేకరించి 13,116 టెస్టులు, ఏప్రిల్లో 3,769 శాంపిల్స్ సేకరించి 7,151 టెస్టులు చేశారు. 5,970 ఆర్టీపీసీఆర్ శాంపిల్స్ సేకరించారు. మే నెలలో 3038 శాంపిల్స్ సేకరించి 6,051 టెస్టులు చేయగా, కరోనా నిర్ధారణ కోసం 5245 శాంపిల్స్ సేకరించారు. జూన్ నెలలో 5,725 శాంపిల్స్ సేకరించి 10,836 టెస్టులు చేశారు. కరోనా నిర్ధారణ కోసం 2,775 ఆర్టీపీసీఆర్ శాంపిల్స్ సేకరించడంతో పాటు 47 మందికి డీడైమర్ పరీక్షలను నిర్వహించారు.
టీ-హబ్ సేవలు మరింత విస్తృతం..
సంగారెడ్డి, జూలై 12 (నమస్తే తెలంగాణ) : సంగారెడ్డిలోని జిల్లాకేంద్ర దవాఖానలో టీ-హబ్(తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్)లో జిల్లా కేంద్ర దవాఖానతో పాటు 11 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే రోగులకు ఉచిత రోగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. త్వరలో మరిన్ని పీహెచ్సీ కేంద్రాలకు ఈ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జహీరాబాద్, హత్నూర ప్రాంతంలో ఉన్న పీహెచ్సీ రోగులకు సైతం టీ-హబ్ ద్వారా పరీక్షలు అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం అవసరమైన వాహనాల కోసం టెండర్లు పిలిచారు. ప్రభుత్వం జిల్లాకు మరో టీ-హబ్ను మంజూరు చేయనుండగా, ఇది నారాయణఖేడ్ ప్రాంతంలో ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ దవాఖానలకు చికిత్స కోసం వచ్చే రోగులకు ఉచిత రోగనిర్ధారణ పరీక్షలు అందుబాటులోకి తేవాలని సర్కారు నిర్ణయించింది.
ఇందుకు ప్రతి జిల్లా కేంద్రంలో సుమారు రూ.2 నుంచి రూ.3 కోట్ల వ్యయంతో టీ-హబ్(తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్)లను ఏర్పాటు చేసింది. టీ-హబ్లో 57 రకాల రోగనిర్ధారణ పరీక్షలు పూర్తిగా ఉచితంగా చేస్తారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో ప్రభుత్వం సొంత భవనంలో టీ-హబ్ను ఏర్పాటు చేసింది. అధునాతనమైన డయాగ్నోసిస్ యంత్రాలతో టీ-హబ్లో పరీక్షలు చేస్తున్నారు. గతంలో ఉచిత పరీక్షలు అందుబాటులో లేక ప్రభుత్వ దవాఖానలకు వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ప్రసుత్తం సంగారెడ్డిలోని టీ-హబ్లో 57 రకాల రోగనిర్ధారణ పరీక్షలు అందుబాటులోకి రావడంతో రోగులు సంతోషంగా ఉన్నారు.
టీ-హబ్లో మధుమేహం (డయాబెటిక్) నిర్ధారణ కోసం ఎఫ్బీఎస్ (ఫాస్టింగ్ బ్లడ్ షుగర్), పీఎల్బీఎస్(పోస్టు బ్లడ్ షుగర్), ఆర్బీఎస్ (ర్యాండమ్ బ్లడ్ షుగర్), గ్లూకోజ్ టాలరెన్స్ తదితర పరీక్షలు నిర్వహిస్తున్నారు. థైరాయిడ్ పరీక్షలు చేస్తున్నారు. లివర్ క్షంక్షన్ టెస్టులో పది రకాల పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. అలాగే డయాగ్నోస్టిక్ హబ్లో రీనల్ ఫంక్షనల్ టెస్టు( రెండు రకాలు), లిపిడ్ ప్రొఫైల్(ఏడు రకాలు) పరీక్షలు చేస్తున్నారు. సీరమ్ ఎల్రక్టోలైట్ పరీక్షల్లో సీరమ్ సోడియం, సీరమ్ పొటాషియం, సీరమ్ క్లోరైడ్తో సహా మరో నాలుగు రకాల పరీక్షలు ఉచితంగా చేస్తున్నారు. పాథాలజీ విభాగంలో కంప్లీట్ బ్లడ్ పిక్చర్ పరీక్షల్లో 14 రకాల పరీక్షలు చేస్తున్నారు. మైక్రో బయాలజీలో చికెన్ గున్యా, డెంగ్యూతో పాటు మరో ఆరు రకాల రోగనిర్ధారణ పరీక్షలు ఉచితంగా చేస్తున్నారు.
19,533 పరీక్షల నిర్వహణ..
సంగారెడ్డిలోని జిల్లా కేంద్ర దవాఖానలో సొంత భవనంలో టీ-హబ్ (తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్)ను ఏర్పాటు చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 17 నుంచి టీ-హబ్లో రోగనిర్ధారణ పరీక్షలు ప్రారంభించారు. ఇన్-పేషెంట్స్తో పాటు ఔట్-పేషెంట్లకు కూడా 57 రకాల ఉచిత పరీక్షలు చేస్తున్నారు. అలాగే 11 పీహెచ్సీల నుంచి రోగులకు సంబంధించి రక్త నమూనాలను ఇక్కడికి తెచ్చి, పరీక్షలు చేస్తున్నారు. ఫలితాలను రోగుల మొబైల్కు పంపుతున్నారు. ఇప్పటి వరకు 8317మంది పరీక్షలు చేసుకున్నారు. వేర్వేరు పరీక్షల నిర్వహణ కోసం టీ-హబ్ సిబ్బంది 8317మంది రోగుల నుంచి 12,670 నమూనాలను సేకరించారు. ఆయా నమూనాలకు సంబంధించి 19,533 రోగనిర్ధారణ పరీక్షలు చేసి ఫలితాలను రోగులకు ఇస్తున్నారు. ఫిబ్రవరిలో 260పరీక్షలు, మార్చిలో 7154, ఏప్రిల్లో 4055, మేలో 1902, జూన్లో 3970, జూలైలో ఇప్పటి వరకు 2192 రోగ నిర్ధారణ పరీక్షలు చేశారు. ఈ సేవలపై రోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 57 రకాల పరీక్షలు అందుబాటులో ఉండటంతో ఎక్కువ మంది టీ-హబ్లోనే పరీక్షలు చేయించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.
పీహెచ్సీల్లోనే శాంపిల్స్ సేకరణ..
జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, జిల్లా దవాఖానకు వచ్చే రోగులు, వెల్నెస్ సెంటర్కు వస్తున్న వారి వద్ద వివిధ రోగనిర్ధారణ పరీక్షలకు శాంపిల్స్ సేకరించి ఆయా రూట్లలో వచ్చేటువంటి శాంపిల్స్ సేకరించే వాహనాల ద్వారా డయాగ్నోస్టిక్ హబ్కు తీసుకువచ్చి అక్కడ పరీక్షలు నిర్వహిస్తారు. మరుసటి రోజు వైద్య పరీక్షల రిపోర్టులను నేరుగా రోగుల సెల్ఫోన్కు మేసేజ్ ద్వారా పంపించడంతో పాటు ల్యాబ్ రిపోర్టులను ఆయా పీహెచ్సీలకు ఆన్లైన్లో పంపిస్తారు. తద్వారా త్వరితగతిన రోగనిర్ధారణ పరీక్షల రిపోర్టులు రావడంతో పాటు పేదలకు ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తుండడంతో పేదలకు ఎంతో మేలు జరుగుతుంది.