సిద్దిపేట టౌన్, జూలై 5 : గోవధ నిషేధమని, గోవులను అక్రమ రవాణా చేసే వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్రెడ్డి ఆదేశించారు. బక్రీద్ పండుగను పురస్కరించుకొని పోలీసు కమిషనర్లు, ఎస్పీలతో పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శి అనిత రాజేంద్రతో కలిసి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ జిల్లాలో సరిహద్దు చెక్పోస్టులను ఏర్పాటు చేయాలన్నారు. గతం లో గోవధ, గోవుల అక్రమ రవాణా చేసిన నేరస్తుల కదలికలపై నిఘా ఉంచాలన్నారు.
చెక్పోస్టుల ఏర్పాటు
గోఅక్రమ రవాణా నిరోధించడానికి సిద్దిపేట జిల్లాలో 5 సరిహద్దు చెక్పోస్టులను ఏర్పాటు చేయనున్నట్లు అడిషనల్ డీసీపీ శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరిహద్దు చెక్పోస్టుల వద్ద పోలీసు అధికారులు, సిబ్బంది నిరంతరం విధులు నిర్వర్తిస్తారని పేర్కొన్నారు. గోవుల అక్రమ రవాణా, గోవధ చేస్తే పోలీసు లకు సమాచారం ఇవ్వాలన్నారు. గోవులను బంధించి అక్రమ రవాణాకు పాల్పడిన గోవధ చేస్తున్నారనే సమాచారం ఉంటే పోలీసు కమిషనరేట్ వాట్సాప్ నంబరు 7901100100, డయల్ యువర్ 100కు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. గోవధ నిషేధ చట్టం 1977 ఆవులు, దూడల మాంసాన్ని ఉపయోగించరాదని, ఇది పూర్తిగా చట్ట విరుద్ధమని జిల్లా వెటర్నరీ వైద్యులు సత్యప్రకాశ్రెడ్డి అన్నారు. పశువులను ఇష్టారీతిన రవాణా చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీలు మహేందర్, రామేశ్వర్, ట్రాఫిక్ ఏసీపీ సైదులు, ఇన్స్పెక్టర్లు క్రాంతికుమార్, యాదాద్రి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
పశువుల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా
పశువుల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్టు మెదక్ ఎస్పీ చందనదీప్తి తెలిపారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో పోలీసు, పశు సంవర్ధక శాఖలకు చెందిన అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పశువులను తరలిస్తున్న వాహనాల సంబంధిత పత్రాలు తప్పనిసరిగా పెట్టుకోవాలని, వాహనంలో పశువు పశువుకు రెండు మీటర్ల దూరం ఉండాలని, వాహనాల్లో పశువులను గుంపులు గుంపులుగా తరలించరాదని తెలిపారు. సమావేశంలో పోలీసు, పశు సంవర్ధక శాఖ అధికారులు పాల్గొన్నారు.
కఠిన చర్యలు తీసుకుంటాం
ఆవులు, లేగదూడలు, ఒంటెలను వధించడం నేరమని, వాటిని అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సంగారెడ్డి ఎస్పీ చంద్రశేఖర్రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ చంద్రశేఖర్రెడ్డి, వెటర్నరీ డిపార్ట్మెంట్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ఎం.వసంతకుమారి మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లాలో ఆవులు, లేగదూడలు, ఒంటెల అక్రమ రవాణాను నిలువరించేందుకు అవసరమైన కార్యాచరణను రూపొందించామన్నారు.