BJP Meeting | సంగారెడ్డి (నమస్తే తెలంగాణ) : సంగారెడ్డిలో బీజేపీ సభ అట్టర్ప్లాప్ కావడంతో ఆ పార్టీలో ఆందోళన నెలకొన్నది. సంగారెడ్డి జిల్లా కంది సమీపంలో బీజేపీ నూతన కార్యాలయాన్ని శుక్రవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరై ప్రారంభించాల్సి ఉంది. అయితే ఆయన హాజరుకాలేదు. వర్చువల్గా ఢిల్లీ నుంచి ప్రారంభించారు. పార్టీ కార్యాలయ ప్రారంభం సందర్భంగా 10వేల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు బీజేపీ నాయకులు ప్రకటించారు. అందుకు అనుగుణంగా మొదట ఏర్పాట్లు చేశారు. జాతీయ అధ్యక్షుడు నడ్డా రావడం లేదని తెలియడంతో బీజేపీ శ్రేణుల్లో నిరుత్సాహం కమ్మేసింది. దీంతో జిల్లా నేతలు పార్టీ ప్రారంభ సభ నిర్వహణపై పెద్దగా ఉత్సాహం కనబర్చలేదు. ఫలితంగా సభ కార్యకర్తలు లేక ఫ్లాప్ అయ్యింది. సభలో పెద్ద సంఖ్యలో ఖాళీ కుర్చీలు దర్శనమివ్వడంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జిల్లా నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. సభ ముగిసిన వెంటనే బీజేపీ జిల్లా అధ్యక్షుడు సహా జిల్లా నేతలను తన వద్దకు పిలిపించుకుని అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. బీజేపీ ముఖ్యనేతలంతా హాజరైన సభను ప్లాప్ చేస్తారా, కార్యకర్తలను సమీకరించడం మీకు చేతకాకపోతే మాకు చెప్పాల్సింది.. నేను చూసుకునేవాడిని అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. బీజేపీ జిల్లా నూతన కార్యాలయం ప్రారంభం సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలను సమీకరించి పెద్ద ఎత్తున సభ నిర్వహించాలని జిల్లా నాయకత్వం నిర్ణయించింది. అయితే శుక్రవారం జరిగిన సభలో వెయ్యి మంది కూడా కార్యకర్తలు లేరని సొంత పార్టీ నాయకులే చెప్పారు
సభలో నాలుగు గ్యాలరీలు మినహా వెనకవైపు మొత్తం ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. కార్యకర్తలు లేక సభ వెలవెలబోయింది. కార్యకర్తలు ఉన్న నాలుగు గ్యాలరీల్లో సైతం చాలాచోట్ల కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. సంగారెడ్డి జిల్లాలోని ఐదు నియోజవర్గాల్లో మాకు బలం ఉందని చెప్పుకునే బీజేపీ నేతలు.. కార్యకర్తలను సమీకరించలేక చేతులు ఎత్తివేశారు. దీంతో సభ ప్లాప్ అయ్యింది. బీజేపీ జిల్లా నేత ఒకరు నాయకులు సభ ప్రారంభానికి ముందు మైక్లో కార్యకర్తలు సమావేశ స్థలానికి రావాలని, కుర్చీల్లో కూర్చోవాలని పదే పదే అనౌన్స్ చేశారు. అయినప్పటికీ కార్యకర్తలు లేక పోవటంతో కుర్చీలు నిండక ఖాళీగా కనిపించాయి. వేదికపైకి వచ్చిన కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, రాష్ర్ట ఇన్చార్జి తరుణ్చుగ్, రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ తదితరులు దీనిని గమనించి అసంతృప్తికి లోనయ్యారు. జిల్లాకు చెందిన నేతలపై సైతం కొంతమంది పార్టీ పెద్దల ముందు తమ పరువు పోయిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సంగారెడ్డి జిల్లాలో పార్టీ సభ ప్లాప్ కావడం పార్టీకి నష్టదాయకమని నేతల్లో ఆందోళన నెలకొన్నది. కాగా, సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాత్రమే పది నిమిషాలు ప్రసంగించారు. బండి సంజయ్ పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపే విధంగా ప్రసంగించకుండా బీఆర్ఎస్ పార్టీ, ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించటానికి పరిమితమయ్యారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా వర్చువల్గా హిందీలో ప్రసంగించారు. అరగంటకుపైగా ఆయన ప్రసంగం సాగింది. స్వోత్కర్ష, పరనిందలా ఆయన ప్రసంగం సాగింది. తన ప్రసంగంలో మొత్తం మోదీని పొగిడేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. అదే తరుణంలో బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు, ఆరోపణలు గుప్పించారు. ఆయన ప్రసంగం ఎవరికీ అర్ధం కాలేదు. నడ్డా ప్రసంగం బీజేపీ కార్యకర్తలను ఆకట్టుకోలేకపోయింది. ఆయన ప్రసంగిస్తున్న సమయంలోనే కార్యకర్తలు సభలో నుంచి వెళ్లిపోవడం కనిపించింది.