సంగారెడ్డి కలెక్టరేట్ 24 : సంగారెడ్డి జిల్లా వార్షిక రుణ ప్రణాళికను రూ.6,188.80 కోట్లతో అదనపు కలెక్టర్ రాజర్షి షా విడుదల చేశారు. గురువారం కలెక్టరేట్ నుంచి గూగుల్ మీట్ ద్వారా బ్యాంకర్లు, సంబంధిత అధికారులతో అదనపు కలెక్టర్ డీసీసీ, డీఎల్ సమావేశం నిర్వహించారు. 2021-22 సంవత్సరానికి గాను రూ.6,188.80 కోట్ల ప్రతిపాదిత జిల్లా వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేశారు. గతేడాది కన్నా ఈ సారి సుమారు 28 శాతం అధికంగా ప్రతిపాదించినట్లు ఆయన వెల్లడించారు.
2021-21 అర్థిక సంవత్సరం వార్షిక రుణ ప్రణాళికలో ప్రాధాన్యత, ప్రధానేతర రంగాలకు రూ.4839.52 కోట్ల రుణాలు ఇవ్వడం లక్ష్యంగా నిర్ణయించగా, ఆ లక్ష్యాన్ని మించి రూ.4897.60 కోట్ల రుణాలు అందించినట్టు గుర్తు చేశారు. ప్రాధాన్యత రంగాలకు రూ.3939.5 కోట్లకు గాను రూ.3084.41 కోట్ల రుణాలు మంజూరు చేసి రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. 8 మున్సిపాలిటీల్లో రూ.49 కోట్ల బ్యాంకు లింకేజీ లక్ష్యంగా ఉండగా, రూ.76.82 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు ఇచ్చామన్నారు. 14 వేల మంది వీధి వర్తకులకు రుణాలు అందించామని ఆయన వివరించారు. ఆయా రుణాలను క్రమం తప్పకుండా చెల్లించిన 8,113 మంది వీధి వర్తకులకు రెండో విడత రుణాలు ఇవ్వాలని కోరారు.
ఎస్సీ యాక్షన్ ప్లాన్ కింద ఆర్థిక మద్దతు పథకాలలో మంజూరైన యూనిట్లను త్వరితగతిన గ్రౌండింగ్ చేసి లబ్ధిదారులకు చేయూతనివ్వాలని బ్యాంకర్లకు సూచించారు. ఎస్సీ యాక్షన్ ప్లాన్ కింద అం దోల్, జహీరాబాద్ నియోజకవర్గాలకు సం బంధించి ఒక్కో నియోజకవర్గానికి 500 యూనిట్ల చొప్పున మినీ డైయిరీ యూనిట్లు మంజూరయ్యాయని పేర్కొన్నారు. ఒక్కో యూనిట్ విలువ రూ.2 లక్షలు అని, అం దులో 70 శాతం సబ్సిడీ, 30 శాతం మాత్ర మే రుణం ఉంటుందని పేర్కొన్నారు. సంబంధిత నియోజకవర్గాల్లోని ఆయా బ్యాంకు మేనేజర్లు లబ్ధిదారులకు రుణం ఇచ్చేందుకు చొరవ చూపాలని అదనపు కలెక్టర్ బ్యాంకర్లను కోరారు.
‘రైతుబంధు’ డబ్బులను పాత బాకీలకు జమ చేయొద్దు
సంగారెడ్డి జిల్లాలోని బ్యాంకర్లతో మాట్లాడిన అదనపు కలెక్టర్ ప్రభుత్వం విడుదల చేసిన రైతుబంధు డబ్బులను పాత బకాయిల కింద జమ చేయొద్దని సూచించారు. రైతుబంధు నిధులను పాత బకాయిలకు జమ చేస్తే సంబంధిత బ్యాంకు మేనేజర్ చర్యలు తప్పవన్నారు. పంచాయతీలకు ఇచ్చిన ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ రుణాలకు సంబంధించి ఎలాంటి బకాయిలు లేకుండా చెల్లించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రుణాలు తీసుకున్న లబ్ధిదారులు తిరిగి బ్యాంకులకు చెల్లించేలా చర్యలు చేపట్టాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు. సమావేశంలో లీడ్ జిల్లా మేనేజర్ రమణారెడ్డి, ఆర్బీఐ, నాబార్డు, వివిధ బ్యాంకుల ప్రతినిధులు, కేవీఐసీ, డీఆర్డీవో, డీఐసీ, మెప్మా, ఎస్సీ కార్పోరేషన్ తదితర శాఖల అధికారులు, బ్యాంకర్లు పాల్గొన్నారు.