జహీరాబాద్, ఆగస్టు 5 : ప్రతి ఎకరాకు సాగు నీరు అందించేందుకు సంగమేశ్వర ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, కాళేశ్వరం నీటితో రైతులు పుష్కలంగా పంటలు సాగు చేసుకొనే అవకాశం ఉందని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు అన్నారు. గురువారం జహీరాబాద్ ఎంపీపీ గిరిధర్రెడ్డి అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే మాణిక్రావు పాల్గొని మాట్లాడారు. వరదనీరు నిల్వ చేసేందుకు జాడిమాల్కాపూర్ శివారులో భారీ చెక్డ్యాం నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపించామన్నారు. నారింజ వాగు పై బుర్థిపాడు, బుచినెల్లి, సత్వార్, చిరాగ్పల్లి శివారులో చెక్డ్యాంలు నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపించామన్నారు. ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ నీరు సరఫరా చేసేందుకు ప్రభుత్వం పనులు చేస్తున్నదన్నారు. నారింజ వాగు ప్రవహించడంతో పంటలకు నష్టం జరిగిందని, నష్టపరిహరం అందించేందుకు ప్రభుత్వానికి నివేదిక పంపించామని ఏవో ప్రవీణ తెలిపారు.
కొత్తూర్(బీ) గ్రామంలో కరెంట్ స్తంభాలు ఏర్పాటు చేసినా వైర్లు బిగించ లేదని సర్పంచు జగన్మోహన్ సభలో తెలిపారు. ఎమ్మెల్యే మాణిక్రావు కల్పించుకొని 15 రోజుల్లో వైర్లు బిగించి కరెంట్ సరఫరా చేయాలని ట్రాన్స్కో ఏడీ మహేశ్కు ఆదేశాలు ఇచ్చారు. కరెంట్ సమస్య ఉన్న గ్రామాల్లో వెంటనే మరమ్మతులు చేయాలని ఎమ్మెల్యే సూచించారు. అర్జున్నాయక్ తండాలో తాగునీరు సరఫరా చేసే బోరు వద్ద కరెంట్ షాక్ తగిలే ప్రమాదం ఉందని తండా వాసులు తెలిపారని, వెంటనే మరమ్మతులు చేయాలని ఎమ్మెల్యే మాణిక్రావు అధికారులను ఆదేశించారు. గతంలో డీడీలు ఇచ్చిన 33 మంది గొర్రెల కాపరులకు ప్రభుత్వం యూనిట్లు మంజూరు చేసిందని పశువైద్య అధికారి గణేశ్కుమార్ తెలిపారు. శేకాపూర్లో భూ సమస్యను పరిష్కరించేందుకు రెవెన్యూ, ఫారెస్టు అధికారులు కలిసి సర్వే చేయాలని ఎంపీటీసీ నర్సింహులు కోరారు. స్పందించిన ఎమ్మెల్యే మాణిక్రావు సర్వే చేసేందుకు చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ నాగేశ్వర్రావును ఆదేశించారు.
జహీరాబాద్ మండలంలో 22 గ్రామాలకు మిషన్ భగీరథ నీరు సరఫరా చేస్తున్నామని. 5 గ్రామాలకు నీరు సరఫరా చేసేందుకు పనులు చేస్తున్నామని డీఈఈ సాబేర్ హుస్సేన్ తెలిపారు. అన్ని గ్రామాలకు మిషన్ భగీరథ నీరు సరఫరా చేసేందుకు పనులు వేగవంతం చేయాలని ఎమ్మెల్యే సూచించారు. మండలంలో అర్హులైన 666 మందికి ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసిందని తహసీల్దార్ నాగేశ్వర్రావు తెలిపారు. కొత్తూర్ (బీ) గ్రామంలో ఉన్న ట్రైడెంట్ చక్కెర పరిశ్రమను ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని సభ్యులు సభలో ఎమ్మెల్యే మాణిక్రావును కోరారు. ప్రభుత్వం క్రషింగ్ చేసేందుకు యాజమాన్యంతో మాట్లాడుతుందన్నారు. జహీరాబాద్ ప్రాంతం కర్ణాటక సరిహద్దులో ఉండడంతో గంజాయి సాగు, గంజాయి అక్రమ రవాణా జోరుగా సాగుతున్నదని, వెంటనే నివారణ చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ సీఐ అశోక్కుమార్కు ఎమ్మెల్యే సూచించారు. సరిహద్దులో చెక్పోస్టు ఏర్పాటు చేసి తనిఖీలు చేయాలన్నారు. సమావేశంలో ఎంపీపీ అధ్యక్షుడు గిరిధర్రెడ్డి, జడ్పీటీసీ నాగిశెట్టి, ఎంపీడీవో రాములు, ఎంపీవో మహేశ్వర్రావు, పీఆర్ ఏఈ కోటేశ్వర్రావు, వివిధ శాఖల అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.