చేర్యాల, జూలై 30 : పబ్జీ గేమ్ పరిచయం కాస్తా ప్రేమగా మారడం.. పెండ్లి వరకు వెళ్లడం.. యువతి కాదనడం.. యువకుడు ఆత్మహత్య చేసుకోవడం.. సదరు యువతి, తమ్ము డి సహాయంతో ప్రేమికుడి మృతదేహాన్ని తీసుకొచ్చి పెట్రోల్ పోసి నిప్పంటించడం.. చివరకు యువతితో పాటు సోదరుడు జైలు పాలైన ఘటన సంచనలంగా మారింది. ముందుగా గుర్తు తెలియని వ్యక్తి సజీవ దహనం కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు, చాకచక్యంగా వ్యవహరించి కేసును ఛేదించారు. చేర్యాల సీఐ శ్రీనివాస్రెడ్డి, ఎస్సై రాకేశ్, నరేందర్, పీసీలు నాలుగు బృందాలుగా ఏర్పడి, 10 రోజుల పాటు శ్రమించి, సినీఫక్కీలో జరిగిన ఘటనలో నిందితులను పట్టుకొని, వారిపై కేసులు నమోదు చేశారు.
శుక్రవారం చేర్యాల పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అడిషనల్ ఎస్పీ, హుస్నాబాద్ ఇన్చార్జి ఏసీపీ మహేందర్ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. మండలంలోని నాగపురికి చెందిన ఓ యువతి ప్రేమపేరుతో సోషల్ మీడియాలో తన ఫొటోలను పెడుతూ అబ్బాయిలను ఆకర్షిస్తూ వారి దగ్గర నుంచి డబ్బులు లాగడం, అవసరం తీరాక వారిని ఏదో కారణంతో వదిలించుకుంటున్నది. ఈ క్రమంలో యువతి పబ్జీ గేమ్ తదితర వాటి ద్వారా పశ్చిమబెంగాలకు చెందిన ఢంఢం పోలీస్స్టేషన్ పరిధికి చెందిన దీపాంకర్దాస్ అనే యువకుడికి వల వేసింది.
నిజమైన ప్రేమగా నమ్మిన యువకుడు, ఏప్రిల్ నెలలో హైదరాబాద్కు వచ్చి, యువతిని కలిశాడు. అనంతరం దీపాంకర్దాస్ సదరు యువతి కలిసి పెళ్లి చేసుకోకుండానే భార్యాభర్తలమని చెప్పుకొని హైదరాబాద్లోని అమీర్పేట్ సమీపంలోగల ఎస్ఆర్నగర్లో గది అద్దెకు తీసుకుని సహజీవనం చేశారు. మూడు నెలల సమయంలో దీపాంకర్దాసు వద్ద డబ్బులు లేవని తెలుసుకున్న యువతి, అతడిని ఎలాగైనా వదిలించుకోవాలని నిత్యం గొడవలు పడేది. జూలై 18న ఇరువురి మధ్య గొడవ తీవ్రం కావడంతో తనను పెళ్లి చేసుకోవాలని, లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని దీపాంకర్దాస్ యువతికి చెప్పాడు. ఆమె తిరస్కరించింది. సచ్చిపో అని చెప్పి గది నుంచి వెళ్లిపోయింది. దీంతో యువకుడు రూంలోని ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ విషయాన్ని నాగపురిలో ఉన్న తన తమ్ముడికి యువతి చెప్పింది. ఆత్మహత్య ఘటన తన అక్కపై రాకుండా తప్పించేందుకు సోదరుడు యూట్యూబ్లో ఫాలో అయ్యా డు. అనంతరం అక్కాతమ్ముడు మృతదేహాన్ని సాయికృష్ణ అనే స్నేహితుడి కారు (ఏపీ 09 బీవై 0054)లో వేసుకొని, హైదరాబాద్ నుంచి పలు రూట్లు మార్చుతూ, సిద్దిపేట, జనగామ జిల్లాల సరిహద్దులోని వీరన్నపేట ఏనేగుట్ట లోపల జూలై 19న ఉదయం 6.30గంటల సమయంలో వేసి వెళ్లిపోయారు. అదే రోజు రాత్రి 11.30గంటల సమయంలో తన కారు (ఏపీ 10 ఏఎస్0108) సోదరుడితో కలిసి యువతి దీపాంకర్దాస్ మృతదేహం వద్దకు వచ్చి, పెట్రోల్ పోసి కాల్చి సమీపంలో ఉన్న తమ గ్రామంలో ఒక రోజుపాటు గడిపి హైదరాబాద్కు వెళ్లిపోయారు.
అనంతరం సీఐ శ్రీనివాస్రెడ్డి, చేర్యాల, కొమురవెల్లి ఎస్సైలు రాకేశ్, నరేందర్రెడ్డి, పీసీలు నాలుగు బృందాలుగా విడిపోయి, సీసీ కెమోరాలు ఆధారంగా విచారణ జరిపి నిందితులను పట్టుకోవడంతో పాటు వారి నుంచి రెండు కార్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులిద్దరిని రిమాండ్ చేసినట్లు చెప్పారు. ఫేస్బుక్కు, వాట్సాప్ తదితర సోషల్ మీడియాపై యువత అప్రమత్తంగా ఉండాలని, మోసపోవద్దని కోరారు. కాగా, సీఐ, ఎస్సై, పీఎస్సైలు సిద్ధారెడ్డి, హెచ్సీ కృష్ణనాయక్, పీసీలు నవీన్, గోవర్ధన్, విజయ్, రాజ్కుమార్, అశోక్, సంతోష్, మోహన్, పల్లవి, చైతన్య, టెక్ టీం ఆపరేటర్ వంశీని అడిషనల్ ఎస్పీ అభినందించడంతో పాటు త్వరలో వారికి రివార్డులను అందజేయనున్నట్లు తెలిపారు.