గుమ్మడిదల/పటాన్చెరు/బొల్లారం, జూలై 30: నిరుపేదలకు కార్పొరేట్ వైద్యమే లక్ష్యంగా సీఎం సహాయనిధిని అందజేస్తూ, వారికి అండగా సీఎం కేసీఆర్ నిలుస్తున్నారని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం పటాన్చెరు ఎమ్మెల్యే కాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని 5 మండలాలకు చెందిన 33మంది లబ్ధిదారులకు మెరుగైన వైద్యం అందించడానికి రూ. 9 లక్షల 57 వేల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కృషితో పటాన్చెరుకు సూపర్ స్పెషాలిటీ దవాఖాన రాబోతుందని హర్షం వ్యక్తం చేశారు. ఖరీదైన డయాగ్నోస్టిక్ సేవలను ఉచితంగా అందించేందుకు ఏరియా దవాఖానలో డయాగ్నోస్టిక్ హబ్ ప్రారంభం కానున్నట్లు తెలిపారు.
నియోజకవర్గవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా ప్రజలు, నాయకులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీవైస్ చైర్మన్ ప్రభాకర్, అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి, పటాన్చెరు కార్పొరేటర్ మెట్టుకుమార్యాదవ్, గుమ్మడిదల జడ్పీటీసీలు సుధాకర్రెడ్డి, కుమార్గౌడ్, బొల్లారం కౌన్సిలర్ చంద్రారెడ్డి, పటాన్చెరు మండల అధ్యక్షుడు పాండు, సర్పంచ్లు ఆలేటి నవీనాశ్రీనివాస్రెడ్డి, కృష్ణ, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు దశరథ్రెడ్డి, విజయ్కుమార్, కుమ్మరి వెంకటేశ్, నక్క వెంకటేశ్గౌడ్, సద్ది విజయభాస్కర్రెడ్డి, చంద్రశేఖర్, రమేశ్ పాల్గొన్నారు. బొల్లారం మున్సిపాలిటీ పరిధికి చెందిన దీననాథ్కు ప్రభుత్వం ద్వారా మంజూరైన 48వేల రూపాయల చెక్కును జిల్లా టీఆర్ఎస్ నాయకుడు, కౌన్సిలర్ చంద్రారెడ్డి సమక్షంలో క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే అందజేశారు. జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, మాజీ ఎంపీటీసీ కృష్ణంరాజు పాల్గొన్నారు.
విగ్రహ ప్రతిష్ఠాపన
పటాన్చెరు మండలం ముత్తంగి గ్రామ పరిధి వివేకానందనగర్కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీ భూలక్ష్మీ దేవత విగ్రహప్రతిష్ఠాపన మహోత్సవంలో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మానసిక ఒత్తిడి దూరం కావాలంటే ప్రతిఒక్కరూ దైవ చింతన అలవాటు చేసుకోవాలని అన్నారు. నియోజకవర్గవ్యాప్తంగా పురాతన ఆలయాల జీర్ణోద్ధరణ చేయడంతోపాటు, నూతన ఆలయాల నిర్మాణాలకు తన సంపూర్ణ సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహకులు ఎమ్మెల్యేని సన్మానించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఉపేందర్, ఆత్మకమిటీ చైర్మన్ కుమార్గౌడ్, మాజీ ఎంపీపీ శ్రీశైలంయాదవ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు దశరథరెడ్డి, వెంకట్రెడ్డి, శ్రీనివాస్, ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.