సంగారెడ్డి మున్సిపాలిటీ, జూలై 26 : కొవిడ్ వ్యాక్సినేషన్ సంగారెడ్డి జిల్లాలో ముమ్మరంగా సాగుతున్నది. ఈ యేడాది జనవరి 16న జిల్లాలో వ్యాక్సిన్ ప్రక్రియను మంత్రి హరీశ్రావు ప్రారంభించగా, ఇప్పటివరకు అంటే ఈ నెల 24వ తేదీ వరకు జిల్లాలో 3,94,359 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. జిల్లాలో మొత్తం 37 కేంద్రాల్లో వ్యాక్సిన్ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. కాగా, జీహెచ్ఎంసీ పరిధిలో 9 కేంద్రాల్లో వ్సాక్సిన్ వేసే ప్రక్రియ కొనసాగుతున్నది. మొదటి డోస్ను 3,13,054 మంది తీసుకోగా, రెండో డోసు 81,305 మంది వేసుకున్నారు. ఇందులో హెల్త్ కేర్ వర్కర్లు మొదటి డోస్ 7,509 మంది, రెండో డోస్ 5,763 మంది వేసుకున్నారు. అలాగే ఫ్రంట్ లైన్ వర్కర్స్ మొదటి డోస్ 10,831 మంది వేసుకోగా, రెండో డోస్ 5,362 మంది తీసుకున్నారు.
వయస్సుల వారీగా..
జిల్లాలో 18-44ఏండ్ల వారు 1,53,302 మంది మొదటి డోస్ వేసుకోగా, రెండో డోస్ 10,967 మంది వేసుకున్నారు. 45-59ఏండ్ల వారు 1,04,477 మంది మొదటి డోస్ తీసుకోగా, రెండో డోస్ 40,624 మంది తీసుకున్నారు. 60 వయస్సు ఆపై బడినవారు మొదటి డోస్ 36,935 మంది వేసుకోగా, రెండో డోస్ 18,589 మంది తీసుకున్నారు. అయితే వ్యాక్సిన్ ప్రారంభం నుంచి జూలై నెల 20 రోజుల్లోనే 86,815 కొవిడ్ నియంత్రణ వ్సాక్సిన్ వేసుకోవడం అత్యధికం. 20 రోజుల్లో 18 వయస్సు పై బడిన వారు 86,815 మంది వాక్సిన్ వేసుకోవడం గమనార్హం. జిల్లాలో వ్యాక్సిన్ వేసే ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైద్యాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కాగా, జిల్లాలోని అన్ని కొవిడ్ వ్యాక్సిన్ వేసే కేంద్రాల్లో ఆది, బుధవారాల్లో తప్పా, అన్ని రోజుల్లో వ్యాక్సినేషన్ కొనసాగుతున్నది.
మెదక్ జిల్లాలో ఏడు లక్షల మందికి..
మెదక్, జూలై 26 : మెదక్ జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. నెలలతో పోలిస్తే ఈ నెల డోసుల సంఖ్య పెరిగింది. దీనికి తగ్గట్టుగా ప్రజలు కూడా అపోహలు వీడి, టీకా కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తరలివస్తున్నారు. ప్రతి రోజూ 2వేల నుంచి 4వేల వరకు తగ్గకుండా టీకాలు అందిస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 2 లక్షల 9వేల 584 మందికి కరోనా టీకాను వేసినట్టు వైద్యాధికారులు తెలిపారు.
ప్రజల్లో పెరుగుతున్న అవగాహన..
టీకా వేసుకునేందుకు ప్రారంభంలో వెనకడుగు వేసిన ప్రజల్లో అవగాహన పెరగడంతో ధైర్యంగా ముందుకు వస్తున్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాల్లో టీకా వేసుకునే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. వారం బుధ, శని, ఆదివారాలు మినహా మిగతా నాలుగు రోజులు వ్యాక్సినేషన్ ప్రక్రియ నిరంతరం కొనసాగుతోంది.
మెదక్ జిల్లాలో ఏడు లక్షల మందికి..
మెదక్ జిల్లాలో 7,67,428 మంది ఉండగా, ఇందులో 18 ఏళ్ల పైబడిన వారు 5,42542 మంది ఉన్నారు. ఇప్పటి వరకు మొదటి డోసు తీసుకున్న వారు 1,60,735 మంది, రెండో డోసులు తీసుకున్న వారు 48,849 మంది ఉన్నారు. ఇందులో 60 ఏళ్ల పైబడిన వారు 54,638 మంది టీకా వేసుకున్నారు. 45 నుంచి 59 ఏళ్ల వారు 99,297 మంది, 18 ఏళ్ల నుంచి 44 ఏళ్ల వారు 44,747 మంది టీకా వేసుకున్నారు.
సిద్దిపేట జిల్లాలో 3,52,315 మందికి..
సిద్దిపేట, జూలై 26 : సిద్దిపేట జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం చురుగ్గా కొనసాగుతున్నది. జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సినేషన్ చేస్తున్నారు. ప్రత్యేకంగా క్యాంపులను ఏర్పాటు చేసి వ్యాక్సిన్ వేశారు. ఈ రోజు వరకు జిల్లా వ్యాప్తంగా 3,52,315 మందికి కరోనా నివారణ టీకా వేశారు. ఇందులో 2,89,168 మందికి మొదటి డోస్ టీకా వేయగా, 63,147 మందికి రెండవ డోస్ టీకా వేశారు. ఇందులో హెల్త్కేర్ వర్కర్స్ 13,611 మంది, ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఫ్రంట్ లైన్ వర్కర్స్ 13,556 మంది, 60ఏండ్లు బడిన వారు 1,09,254 మంది, 45-59ఏండ్ల మధ్య వయస్సు గల వారు 1,43,941 మంది, 18 -44 ఏండ్ల వయస్సున్న వారు 71,953 మందికి టీకాలు వేశారు. సోమవారం 4,953 మందికి రెండవ డోస్ టీకాను వేశారు.
వారం రోజులు సెకండ్ డోస్ మాత్రమే..
జిల్లాలో వ్యాక్సిన్నేషన్ కార్యక్రమం సక్రమంగా జరుగుతున్నది. ఎలాంటి ఇబ్బందులు లేవు. జిల్లాలో ఇప్పటివరకు 3,94,359 మందికి వ్యాక్సిన్ వేశాం. ఫస్ట్ డోస్లో 3,13,054 మందికి, సెకండ్ డోస్లో 81,305 మందికి అందించాం. జిల్లాలో మొదటి డోస్ వేసుకున్న వారు రెండో డోస్ కోసం ఎదురుచూస్తున్నారు. వారి కోసం జిల్లాలోని అన్ని వ్యాక్సిన్ కేంద్రాల్లో రెండో డోస్ మాత్రమే అందించనున్నాం. ఈ ప్రక్రియ వారం రోజుల వరకు ఉంటుంది. తర్వాత మొదటి డోస్ అందిస్తాం. ప్రజలు ఈ విషయంలో నిరాశపడొద్దు.
టీకానే శ్రీరామరక్ష..
మూడో దశ కరోనాను ఎదుర్కొనేందుకు టీకానే రక్షణగా ఉంటుంది. మెదక్ జిల్లాలో ఇప్పటి వరకు 2 లక్షల 9వేల 584 మందికి కరోనా టీకా వేశాం. అర్హులైన వారందరూ జిల్లాలోని 20 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో టీకాను వేసుకోవచ్చు. ముఖ్యంగా పిల్లల తల్లిదండ్రులందరూ టీకా తీసుకోవాలి.