సంగారెడ్డి, జూలై 16 (నమస్తే తెలంగాణ) : సంగారెడ్డి జిల్లాలో ఉద్యానవనశాఖ ఆధ్వర్యంలో కొత్తగా రెండు రైతు ఉత్పత్తిదారుల సంస్థలు ఏర్పాటు కానున్నాయి. జిల్లా కేంద్రమైన సంగారెడ్డి కేంద్రంగా ‘సంగారెడ్డి మామిడి రైతు ఉత్పత్తిదారుల సంస్థ’, జహీరాబాద్ కేంద్రంగా ‘ఎక్కెళ్లి రైతు ఉత్పత్తిదారుల సంస్థ’ పేరిట లిమిటెడ్ కంపెనీలు ఏర్పాటు చేస్తున్నారు. త్వరలోనే రెండు సంస్థలు కార్యకలాపాలను ప్రారంభించనున్నాయి. ఒక్కో రైతు ఉత్పత్తిదారుల సంఘంలో 200మంది రైతులు సభ్యులుగా ఉంటారు. 200 మంది సభ్యుల నుంచి 11 మందితో పాలకవర్గాన్ని ఏర్పాటు చేస్తారు. పాలకవర్గంలో ఒకరిని చైర్మన్గా, మరొకరిని సంస్థ సీఈవోగా ఎన్నుకుంటారు. వీరి ఆధ్వర్యంలో రైతు ఉత్పత్తిదారుల సంస్థలు పనిచేస్తాయి. ఈ రైతు ఉత్పత్తిదారుల సంస్థల పాలకవర్గాల ఎన్నిక త్వరలోనే జరుగనున్నది. సంస్థల నిర్వహణపై జహీరాబాద్, సంగారెడ్డి ప్రాంత రైతులకు శిక్షణను ఇవ్వనున్నారు. శిక్షణ కార్యక్రమాలు పూర్తయిన వెంటనే రెండు రైతు ఉత్పత్తిదారుల సంస్థలు తమ కార్యకలాపాలను ప్రారంభించనున్నాయి. రైతు ఉత్పత్తిదారుల సంస్థల నిర్వహణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సహా యం అందించనున్నాయి. దీంతో పాటు నాబార్డు ఎన్సీడీసీ (నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, నాఫెడ్ (నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ పెడరేషన్) నుంచి సంగారెడ్డి, ఎక్కెళ్లి రైతు ఉత్పత్తిదారుల సంస్థలకు రుణాలు అందనున్నాయి.
త్వరలోనే కార్యకలాపాలు…
సంగారెడ్డి ప్రాంతంలో మామిడి తోటలు ఎక్కువగా పండిస్తారు. పరిసర ప్రాంతాల్లో 500 ఎకరాలకుపైగా మామిడి తోటలు ఉన్నాయి. ఏటా ఇక్కడ కొనుగోలు చేసిన మామిడి కాయలు, పండ్లను హైదరాబాద్తో పాటు పొరుగు రాష్ర్టాలకు తరలిస్తున్నారు. మామిడి లాభసాటిగా ఉండడంతో సంగారెడ్డి జిల్లాలో మామిడితోటల సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో సంగారెడ్డి రైతు ఉత్పత్తిదారుల సంస్థ సీజన్లో రైతుల నుంచి మామిడి కొనుగోలు చేసి మార్కెటింగ్ చేసేందుకు సిద్ధమవుతున్నది. వచ్చే సీజన్లో మామిడి పంట సేకరించి మార్కెట్లో విక్రయించేందుకు ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నది. మామిడి సీజన్ ఆరంభానికి ముందే మామిడి తోటలు ఉన్న రైతులను కలిసి వారితో ఒప్పందాలు కుదుర్చుకోనున్నది. దీంతో రైతులకు లాభం చేకూరడంతో పాటు రైతు ఉత్పత్తిదారుల సంస్థకు మార్కెటింగ్ ద్వారా లాభాలు సమకూరనున్నాయి. రైతులు వేసవి సీజన్లో తక్కువ ధరకే వ్యాపారులకు మామిడి పండ్లను అమ్ముతున్నారు. హైదరాబాద్ ఇతర బహిరంగ మార్కెట్లకు తరలించి అమ్ముకోవాలంటే రవాణా చార్జీలు రైతులకు అదనంగా భారం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో సంగారెడ్డి రైతు ఉత్పత్తిదారుల సంస్థ రైతుల వద్దే మామిడి పంటను కొనుగోలు చేసేలా ప్రణాళిక సిద్ధ్దం చేస్తున్నది. దీని ద్వారా రైతులకు మద్దతు ధర లభించటంతోపాటు రవాణా భారం తగ్గుతుంది. రైతుల నుంచి సేకరించి మామిడిని గ్రేడింగ్, ప్యాకింగ్ చేసి హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాల్లో విక్రయించడం ద్వారా రైతు ఉత్పత్తిదారుల సంస్థలకు ఆదాయం సమకూరే అవకాశాలు ఉన్నాయి. వీటితో పాటు గ్రామాల్లోని తమ సభ్యులైన రైతుల ద్వారా పం డ్లు, కూరగాయలు, పూలు సేకరించి హైదరాబాద్లోని మార్కెట్లో విక్రయించేందుకు ప్రణాళికను సిద్ధ్దం చేస్తున్నారు. ఫర్టిలైజర్, క్రిమిసంహారక మందుల దుకాణాలను నడిపేందుకు ప్రణాళికను సిద్ధ్దం చేస్తున్నారు.
జహీరాబాద్ కేంద్రంగా…
జహీరాబాద్ కేంద్రంగా ఎక్కెళ్లి రైతు ఉత్పత్తిదారుల సంస్థ ద్వారా సైతం రైతులకు అవసరమైన ఎరువులు, క్రిమిసంహారక మందులు, విత్తనాల దుకాణాలను ఏర్పాటు చేయనున్నారు. జహీరాబాద్ ప్రాంతంలో ప్రధానంగా ఆలుగడ్డ, పసుపు, అల్లం వంటి ఉద్యానవన పంటలు, మామిడి, బొప్పాయి పండ్లు ఎక్కువగా పండిస్తారు. ఆయా పంటలను రైతుల నుంచి సేకరించి మార్కెటింగ్ చేసేందుకు అధికారులు, రైతు ఉత్పత్తిదారుల సంస్థ ప్రతినిధులు ప్రణాళికలను సిద్ధ్దం చేస్తున్నారు. ప్రభుత్వం జిల్లాలో స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటు చేస్తున్నది. ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లో పండ్లు, కూరగాయల పంటల ఆధారంగా ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పడిన పక్షంలో, వారికి అవసరమైన పం డ్లు, కూరగాయలు అందించే అవకాశాలను రైతు ఉత్పత్తిదారుల సంస్థలు పరిశీలిస్తున్నాయి. ఉద్యానవనశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న సంగారెడ్డి, ఎక్కెళ్లి రైతు ఉత్పత్తిదారుల సంస్థలు త్వరలోనే కార్యకలాపాలను ప్రారంభించనున్నాయి. తద్వారా సంస్థలోని భాగస్వాములతో పాటు రైతులకు మేలు జరగునున్నది.
మామిడి ఉత్పత్తిదారులకు శిక్షణ
సంగారెడ్డి కలెక్టరేట్, జూలై 17: పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో మామిడి ఉత్పత్తిదారులకు శనివారం సంగారెడ్డిలో అవగాహన కల్పించారు. మామిడి ఉత్పత్తిదారుల సంస్థ (ఎఫ్పీవో) సభ్యులకు ఒక రోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించి మామిడి ఉత్పత్తుల నాణ్యతలో పాటించాల్సిన సూచనలు, సలహాలు అందించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉద్యాన అభివృద్ధి సంస్థ జీఏం బాబు, ఏజీఏం కె.లత, ఆంధ్రప్రదేశ్ మహిళా అభివృధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాస్, కంపెనీ కార్యదర్శి శ్రీచరణ్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి సునీత పాల్గొన్నారు.
త్వరలోనే ప్రారంభం..
ప్రభుత్వ ఆదేశాలతో సంగారెడ్డి జిల్లాలో రెండు రైతు ఉత్పత్తిదారుల సంస్థలను ఏర్పాటు చేస్తు న్నాం. రెండు సంస్థల పేర్లను రిజిస్టర్ చేశాం. సంగారెడ్డి కేం ద్రంగా సంగారెడ్డి మామిడి రైతు ఉత్పత్తిదారుల సంస్థ, జహీరాబాద్ కేంద్రంగా ఎక్కెళ్లి రైతు ఉత్పత్తిదారుల సంస్థను త్వరలోనే ప్రారంభిస్తాం. ఒక్కో సంస్థలో 200 మంది రైతులు సభ్యులుగా ఉంటారు. ఒక్కో సంస్థకు చైర్మన్, సీఈవోలు ఉంటారు. వీరి ఆధ్వర్యంలో వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన వ్యాపారాలు చేస్తాయి. ఎరువులు, క్రిమిసంహారక మం దులు, విత్తనాల దుకాణాలను రైతు ఉత్పత్తిదారుల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తాం. పెట్రోల్బంక్ల ఏర్పాటును పరిశీలిస్తున్నాం. రైతులు స్థానికంగా పం డించే ఉద్యానవన పంటలను సేకరించి రైతు ఉత్పిత్తదారుల సంస్థల ద్వారా మార్కెటింగ్ చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాం.
-సునీత, జిల్లా ఉద్యానవనశాఖ అధికారి, సంగారెడ్డి