సంగారెడ్డి కలెక్టరేట్, అక్టోబర్ 15: దళితబంధు లబ్ధిదారులు ఆర్థికంగా, ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ ఆకాంక్షించారు. ఎంచుకున్న యూనిట్లతో సక్సెస్ సాధించాలని పిలుపునిచ్చారు. దళిత బంధు పథకం కింద నెలకొల్పిన వివిధ యూనిట్ల లబ్ధిదారుల స్థితిగతులు, యూనిట్ల అభివృద్ధి, లాభాల పురోగతి తదితర అంశాలపై అదనపు కలెక్టర్ రాజర్షి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ, దళిత బంధు నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, మండల ప్రత్యేకాధికారులు, ఎంపీడీవోలతో కలెక్టర్ శనివారం క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దళిత బంధు యూనిట్లను మరింత అభివృద్ధి చేసుకోవడంతో పాటు మరికొందరికి ఉపాధి కల్పించేలా అభివృద్ధి చెందాలన్నారు. లబ్ధిదారులు తాము తీసుకున్న యూనిట్తో విజయవంతమై ఆర్థికంగా ఎదిగేలా చూడాల్సిన బాధ్యత ప్రత్యేకాధికారులు, ఎంపీడీవోలదేనని స్పష్టం చేశారు. ఆయా యూనిట్లకు డబ్బు విడుదల చేసేటప్పుడు సమగ్రంగా పరిశీలించాలని సూచించారు. లబ్ధిదారులకు అందించిన ప్రతి యూనిట్ను స్వయంగా పరిశీలించాలన్నారు. మండల స్థాయిలో అవగాహన కల్పించాలి
దళిత బంధు లబ్ధిదారులకు మండల స్థాయిలో ఓరియంటేషన్ నిర్వహించాలని ఎంపీడీవోలకు సూచించారు.
దళిత బంధు యూనిట్తో సక్సెస్ అయిన వారితో, ఏ విధంగా విజయవంతంగా యూనిట్ నడుస్తున్నదన్న విషయాన్ని అందరికీ వివరించేలా మాట్లాడించాలన్నారు. అవసరమైన లబ్ధిదారులకు సపోర్ట్ చేయాలన్నారు. డెయిరీ యూనిట్లను టై అప్ చేసి లబ్ధిదారులకు రెగ్యులర్గా ఆదాయం వచ్చేలా చూడాలన్నారు. వివిధ యూనిట్లు నెలకొల్పిన లబ్ధిదారులకు ఏవిధంగా లాభదాయకంగా ఉం టుందో వాటిని అందించేలా చర్యలకు తీసుకోవాలన్నారు. పాక్షికంగా గ్రౌండింగ్ చేసిన యూనిట్లు పూర్తిస్థాయిలో గ్రౌండింగ్ చేయాలని కలెక్టర్ సూచించారు. ఆయా యూనిట్లకు ఎలాంటి సహకారం అవసరమైనా ఆ దిశగా చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాబురావు, నియోజక వర్గ ప్రత్యేకాధికారులు డీఆర్డీవో శ్రీనివాసరావు, డీపీవో సురేశ్ మోహన్, జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీసీవో ప్రసాద్, పరిశ్రమల శాఖ జీఏం ప్రశాంత్ కుమార్, వ్యవసాయ శాఖ జేడీ నర్సింహరావు, ఉద్యన వన శాఖ అధికారి సునీత, మండల ప్రత్యేకాధికారులు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.